హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూముల సమస్యలపై దరఖాస్తు చేసుకొనేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచుకుంటున్నారు. ధరణి పోర్టల్లో ‘ఐప్లె ఫర్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్’ పేరుతో ప్రభుత్వం ఈ నెల 6 న గ్రీవెన్స్ మాడ్యూల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 9 రకాల ఆప్షన్లు పొం దుపరిచింది. ఆధార్ అనుసంధానంలో లోపాలు, పేర్లు, భూవిస్తీర్ణం తప్పుగా నమోదవడం, సర్వేనంబర్ కనిపించకపోవడం వంటి ప్రధాన సమస్యలపై దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. మీసేవ కేంద్రం నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. మాడ్యూల్ ప్రారంభమైన 20 రోజుల్లోనే సుమారు 10 వేల అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు. సగటున రోజుకు 500 వరకు దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. అవి నేరుగా కలెక్టర్ల లాగిన్కు వెళ్తున్నాయని.. వారు వాటిని పరిశీలించి.. పరిష్కారానికి చర్యలు ప్రారంభించారని వివరించారు. కాగా, కోర్టు వివాదాల్లో ఉన్న సర్వే నం బర్లు మాడ్యూల్లో కనిపించకపోవడంతో దరఖాస్తుదారులు గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు గ్రీవెన్స్ మాడ్యూల్లో వివరాలు క్లుప్తంగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సమగ్ర వివరాలతో మరోసారి ప్రకటన విడుదల చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.