కవాడిగూడ, మార్చి 24: కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హెచ్చరించారు. బుల్లెట్ ట్రైన్లు ప్రవేశపెడుతున్న తరుణంలో కోచ్ ఫ్యాక్టరీ అవసరాన్ని గుర్తించి వెంటనే ఏర్పాటుచేయాలని డిమాండ్చేశారు. బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ డివిజన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాలు నిర్వహించిన దీక్షకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు ఒక్క భారీ పరిశ్రమ కూడా రాలేదని గుర్తుచేశారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేయొద్దని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పలేదని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని చెప్పారు. ఛీప్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. కాజీపేటను రైల్వే డివిజన్గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉన్నదని అన్నారు. కోచ్ఫ్యాక్టరీ హామీ విభజన చట్టంలో భాగమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షుడు గాదె ఇన్నయ్య తదితరులు పాల్గొన్నాయి.
రైల్వేమంత్రి పీయూష్ గోయల్కు
టీఆర్ఎస్ ఎంపీల లేఖ
విభజనచట్టం ద్వారా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాజీపేటలో కోచ్ఫ్యాక్టరీ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎంపీలు.. రైల్వే మంత్రి పీయూష్గోయల్ను బుధవారం కలిసి లేఖ అందజేశారు. కాజీపేటలో కోచ్ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారని అందు లో గుర్తుచేశారు. ఇప్పటికైనా కేంద్రం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తిచేశారు. పార్లమెంట్ సాక్షిగా పవిత్రమైన వాగ్దానం చేసి, కేంద్రం ఇప్పుడు కాదనడం బాధగా ఉన్నదని చెప్పారు. మంత్రిని కలిసినవారిలో ఎంపీలు బండ ప్రకాశ్, సంతోష్కుమార్, బీబీ పాటిల్, మాలోతు కవిత, గడ్డం రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేతకాని, మన్నె శ్రీనివాస్రెడ్డి, పోతుగంటి రాములు, కేఆర్ సురేశ్రెడ్డి, పసునూరి దయాకర్ ఉన్నారు.