దేశానికే అన్నంపెట్టే స్థాయికి రాష్ట్రం
రైతు చేయి చాపొద్దన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశం
రుణమాఫీకి బడ్జెట్లో రూ.5,250 కోట్లు
మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ‘ఏ ఉద్దేశంతో తెలంగాణ కోసం అందరం కొట్లాడామో.. దానికోసమే సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. కాళేశ్వర జలాలతో వ్యవసాయం వృద్ధిచెంది లక్ష్యానికి మించి దిగుబడులు వచ్చా యి. 60 శాతం బియ్యం కొన్న ఎఫ్సీఐ.. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ప్రకటించింది’ అని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 70 ఏండ్లలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని కొనియాడారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కేటీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బొప్పాపూర్ రాచర్లకోట గుట్టపైన నిర్మించిన రేణుక ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించిన సిద్దోగ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం బొప్పాపూర్లో దాత చిదుగు గోవర్ధన్గౌడ్ తన తండ్రి వెంకటయ్యగౌడ్ జ్ఞాపకార్థం రూ.24 లక్షలతో నిర్మించిన రాష్ట్రంలోనే తొలి ఏసీ రైతువేదికను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆరునెలల్లో 2,600 రైతు వేదికలు నిర్మించామని తెలిపారు. అన్ని రైతు వేదికలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి, హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు, సూచనలు ఇప్పిస్తామని చెప్పారు. రైతులు చేయిచాపే పరిస్థితి రాకూడదన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని.. అందుకే రూ.లక్ష, రూ.25 వేలలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్టు స్పష్టంచేశారు. రుణమాఫీ కోసం బడ్జెట్లో రూ.5,250 కోట్లు కేటాయించినట్టు గుర్తుచేశారు. గోదావరి జలాలతో జిల్లాలోని మెట్ట ప్రాంతాన్ని అభిషేకిస్తానని పునరుద్ఘాటించారు. మల్లన్నసాగర్ నీటిని కూడవెళ్లి వాగులోకి వదిలారని, ఆ వాగు ద్వారా నీరు గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరులోకి చేరుతుందని వెల్లడించారు. ఎస్సారార్నుంచి ఎగువమానేరు ప్రాజెక్టును నింపేందుకు చేపట్టిన ఎత్తిపోతల పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. దానిని సీఎం చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించేలా కృషి చేస్తానని ఆయన చెప్పారు.
మౌలిక్ చికిత్సకు సహకరిస్తా
తమ కొడుకు మౌలిక్(6) మెదడు సంబంధిత వ్యాధితో నాలుగేండ్లుగా బాధపడుతున్నాడని.. ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించినా కోలుకోలేదని మండలంలోని బండలింగంపల్లికి చెందిన చింతల విజయ్-సంగీత దంపతులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి.. మౌలిక్ చికిత్సకు తప్పకుండా సహకరిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.