సొంత బావమరిదిని హత్య చేసిన బావ
పోలీసులు అదుపులో నిందితుడు
మలక్పేట్ : నిండు గర్భిణి అయిన అక్కతో గొడవ పడితే చంపేస్తానని అన్న బావమరిదిని కత్తితో పొడిచి కడతేర్చాడు. శుక్రవారం రాత్రి మూసారాంబాగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మలక్పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఓల్డ్ మలక్పేట శంకర్నగర్కు చెందిన మోసిన్, భార్య తల్లిదండ్రులు, బావమరిది హబీబ్(21)తో కలిసి మూసారాంబాగ్ చౌరస్తాలో యాచిస్తూ జీవిస్తున్నాడు. గర్భంతో ఉన్న భార్యతో మోసిన్ తరచూ గొడవపడుతుండేవాడు. దీంతో తన అక్కతో గొడవ పడటం మానుకోవాలని, లేకుంటే అంతుచూస్తానని హబీబ్.. తన బావ మోసిన్ను హెచ్చరించాడు. నన్ను చంపడం కాదు….నిన్నే చంపేస్తానంటూ వెంట తెచ్చుకున్న కత్తితో హబీబ్ కడుపులో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని హబీబ్ను ఉస్మానియా దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ, జాయింట్ కమిషనర్ రమేశ్, మలక్పేట ఏసీపీ వెంకటరమణ, సీఐ సుబ్బారావులు సందర్శించి హత్యపై ఆరా తీశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.