పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
అభివృద్ధి బాటలో మద్దుల్వాయి,ముత్తాయికోట జీపీ
రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం
మెరుగుపడిన మౌలిక వసతులు
శిథిల ఇండ్లు, పాడుబడిన బావులపూడ్చివేతతో పరిసరాలు శుభ్రం
పల్లెప్రకృతి వనం ఏర్పాటు
హవేళిఘనపూర్ మార్చి 19:మద్దుల్వాయి-ముత్తాయికోట చిన్న గ్రామ పంచాయతీ. కానీ, అభివృద్ధిలో పెద్ద గ్రామాలతో పోటీపడుతున్నది. గతంలో గ్రామంలో కనీస సౌకర్యాలు కరువయ్యా యి. కానీ, ఇప్పుడు మౌలిక వసతులు మెరుగు పడ్డాయి. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు మారాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం వంటి సౌకర్యాలు గ్రామంలో అందుబాటులోకి వచ్చాయి.
ఆ పంచాయతీలో 256 మంది మాత్రమే జనాభా ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిం చింది. పల్లె ప్రగతిలో భాగంగా సీసీ రోడ్డు, డ్రైనేజీలు, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, విద్యుత్ దీపాలు అందుబాటులోకి వచ్చాయి. ట్రాక్టర్ ద్వారా ఇంటింటా తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నారు. పాడుబడిన బావులు, శిథిల ఇండ్లను కూల్చి వేయడంతో పరిసరాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. హవేళిఘనపూర్ మండలం మద్దుల్ వాయి-ముత్తాయికోటలో జరిగిన అభివృద్ధిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మద్దుల్వాయి-ముత్తాయికోట గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. 256 జనాభా ఉన్న ఈ గ్రామాల్లో గతంలో కనీస సౌకర్యాలు లేకుండే, ఇప్పుడు గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనం, విద్యుత్ దీపాలు అందుబాటులోకి వచ్చాయి. పల్లెప్రగతితో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల కృషితో గ్రామం అభివృద్ధి చెందుతున్నది. గతంలో మురుగు కాలువలు లేక రోడ్లపై మురుగు పారేది. గ్రామ సర్పంచ్ అనురాధ ఆధ్వర్యంలో డ్రైనేజీలు నిర్మించడంతో మురుగు సమస్య తీరింది. ప్రభుత్వం మద్దల్వాయి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ సమకూర్చింది. ట్రాక్టర్ ద్వారా ఇంటింటా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామంలో పరిసరాలు శుభ్రంగా మారాయి. జీపీ ట్యాంకర్ ద్వారా నిత్యం హరితహారం మొక్కలకు నీరందించి సంరక్షిస్తున్నారు.
లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు…
మండల పరిధిలోని మద్దుల్వాయి- ముత్తాయికోట గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.50లక్షల నిధులు మంజూరు చేసింది. రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ.3 లక్షలతో డ్రైనేజీలు, రూ.2 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మించారు. రూ.90 వేలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. గ్రామంలో 10 వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పల్లెప్రగతిలో 12 పాత ఇండ్లు, 2 పాడుబడిన బావులు పూడ్చారు. దీంతో గ్రామంలో పరిసరాలు శుభ్రంగా మారాయి. గ్రామ శివారులో డంపింగ్ యార్డు,వైకుంఠధామం నిర్మాణం చేపట్టారు. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల పూల మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.
పాత బావులు, ఇండ్లు కూల్చివేత
గ్రామంలో పాడుబడిన బావుల్లో పశువులు పడి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. వీటి ద్వారా దోమలు పెరిగి గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యేవారు. దీంతో ప్రభుత్వం పాడుబడిన బావులు, పాత ఇండ్లను కూల్చివేసింది. పల్లెప్రగతిలో 2 బావులు, 12 శిథిల ఇండ్లను కూల్చడంతో గ్రామస్తులకు సౌకర్యంగా మారింది.
లక్షలాది రూపాయలతో అభివృద్ధి
తడి, పొడి చెత్త సేకరణపై ప్రజల్లో మరింతగా చైతన్యం రావాలి. ఇంటి వద్దకు వచ్చిన సమయంలో తడి, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా జీపీ సిబ్బందికి సులువుగా ఉంటుంది. పల్లెప్రగతిలో గ్రామంలో లక్షలాది రూపాయలతో మౌలిక వసతులను ప్రభుత్వం సమకూర్చింది. జీపీకి నెలనెలా నిధులు వస్తుండడంతో సమస్యలు పరిష్కరిస్తున్నాం.