న్యూఢిల్లీ, మార్చి 18: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్గేట్లను తొలగించి, పూర్తిస్థాయిలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త విధానంలో వాహనాలపై ఉండే జీపీఎస్ ఇమేజింగ్ ద్వారా టోల్ వసూళ్లు జరుగుతాయని చెప్పారు. ‘దేశంలో 93 శాతం వాహనాల యజమానులు ప్రస్తుతం ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లిస్తున్నారు. ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు టోల్ వసూలు చేస్తున్నాం. అయినా మిగతా 7 శాతం మంది మాత్రం ఇప్పటికీ ఫాస్టాగ్ తీసుకోలేదు. ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించని వాహనాలపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించామ’ని గడ్కరీ చెప్పారు. టోల్గేట్ల ఎత్తివేత, స్వచ్ఛంద వాహన తుక్కు పథకంపై గడ్కరీ లోక్సభ, రాజ్యసభలో గురువారం ప్రకటన చేశారు. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోవడంవల్ల టోల్, జీఎస్టీ ఎగవేత ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లింపునకు వీలు కల్పించే ఫాస్టాగ్ విధానాన్ని 2016లో ప్రవేశపెట్టారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి నిరీక్షించాల్సిన అవసరం తప్పింది. గత నెల 16 నుంచి ఫాస్టాగ్ను తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేస్తున్నారు.
పాత వాహనాలను యజమానులు స్వచ్ఛందంగా తుక్కుగా మార్చే విధానంతో పలు ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. పాత వాహనాన్ని తుక్కుగా మార్చినప్పుడు ఆయాకేంద్రాల్లో ఇచ్చే ధ్రువపత్రాన్ని చూపిస్తే కొత్త వాహనంపై 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని తయారీదారులకు సూచిస్తామన్నారు. దీంతో పాటు రోడ్ ట్యాక్స్లో వ్యక్తిగత వాహనాలకు 25 శాతం, వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ ఇవ్వాలని రాష్ర్టాలకు సూచిస్తామని చెప్పారు. కొత్త వాహనానికి రిజిస్ట్రేషన్ ఫీజును కూడా రద్దు చేసే అవకాశం ఉందని తెలిపారు.
న్యూఢిల్లీ : కొన్ని కంపెనీలు ఇంటర్నెట్పై గుత్తాధిపత్యం కోసం (ఇంటర్నెట్ సామ్రాజ్యవాదం కోసం) ప్రయత్నిస్తున్నాయని, అలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.