హైదరాబాద్ : రాష్ట్రంలోని మహిళలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే షీ టాయిలెట్లు నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు కొత్తగా పోలీసు స్టేషన్లు, అన్ని యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లను నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు ప్రతిపాదించింది. మహిళా పోలీసు అధికారులు, సందర్శకులు, మహిళా నేరస్తులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో, అన్ని పోలీసు స్టేషన్లలో షీ టాయిలెట్లు నిర్మించేందుకు రూ. 20 కోట్లు, అదే రీతిలో మహిళా ప్రొఫెసర్లు, విద్యార్థినులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు యూనివర్సిటీల్లో రూ. 10 కోట్లు ప్రతిపాదించి షీ టాయిలెట్లను నిర్మిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించారు. మొత్తంగా మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,702 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.