సుల్తాన్బజార్, మార్చి 17 : ఉస్మానియా దవాఖానలో పేదరోగుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్ భవన ర్యాంపు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులకు సూచించారు. పేద రోగులు అత్యధికంగా వచ్చే ఉస్మానియా దవాఖానలో రోగులకు అనుగుణంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నైట్ షెల్టర్ను నిర్మించారు. దవాఖానలో శిథిలావస్థకు చేరిన పాత భవనం మూసివేశారు. దాంతో రోగులకు ఇబ్బందులు కలుగకుండా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించారు. వారి అనుమతి మేరకు టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు నైట్ షెల్టర్ భవనంలో ర్యాంపు నిర్మాణ పనులను రెండేండ్ల క్రితం ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో గతేడాది ర్యాంపు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ పనులను పరిశీలించిన డాక్టర్ నాగేందర్ ఈ నెలాఖరులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు.
ఉస్మానియా దవాఖానలో పాతభవనం మూసివేతతో రోగులకు ఇబ్బందులు పడుతున్నారు. కులీకుతుబ్షా భవనం నాల్గవ అంతస్తులో షెడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి రోగులకు ఇబ్బందులు పడకుండా దవాఖాన పాలకవర్గం కృషి చేసింది. జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్ భవనంలో ర్యాంపు నిర్మాణ పనులు పూర్తైతే రోగులకు మరింత మేలు జరుగుతుందని పాలక వర్గం తెలుపుతుంది. ఈ భవనంలో ర్యాంపు నిర్మాణ పనులు పూర్తైతే 7 టేబుళ్లతో కూడిన రెండు ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, రోగి సహాయకుల విశ్రాంతి గది అందుబాటులోకి వస్తాయని వివరించారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గతేడాది నైట్ షెల్టర్లో పనులు నిలిపి వేయడంర్త ర్యాంపు నిర్మాణ పనులు జాప్యం జరిగింది. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా రోగుల సౌకర్యార్థం అందుబాటులోకి వస్తుంది. ఈ భవనంలో ఆర్థో, జనరల్ సర్జరీ విభాగాల రోగులకు త్వరితగతిన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. ఉస్మానియా దవాఖానకు వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి చర్యలు తీసుకుంటుంన్నాం.- డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్ ఉస్మానియా దవాఖాన