అమ్మ ముద్దలో ప్రేమ, నాన్న ముద్దలో మమకారం, తాతయ్య ముద్దలో వాత్సల్యం, నానమ్మ ముద్దలో మురిపాలు.. బిడ్డ ఎదగడానికి ఇవి మాత్రమే సరిపోవు! ప్రతి ముద్దా పోషకాల గని కావాలి. మెతుకు మెతుకులో విటమిన్లు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉండాలి. చందమామను చూపినా, చల్లగాలికి తీసుకెళ్లినా కొన్నిసార్లు పసివాడు మొహం తిప్పేసుకుంటాడు. బలవంతంగా నోట్లో కుక్కినా ఉమ్మేసుకుంటాడు. అది అయిష్టత కానేకాదు. తన బాధనూ, భయాలనూ వ్యక్తం చేయడానికి ఆ బిడ్డకున్న ఒకే ఒక మార్గం. ఈ భాషను అమ్మలు అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా ముందు, పసివాళ్లకు ఏం తినిపించాలి, ఎలా తినిపించాలి, ఎంత తినిపించాలి అన్న స్పష్టత ఉండాలి.
పసిపిల్లల ఆరోగ్యానికి, ఆహారానికి సంబంధించి అంతర్జాతీయంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. చాలాకాలం వరకూ బిడ్డకు తొమ్మిదినెలలు వచ్చేదాకా ఏ ఘనాహారమూ పెట్టేవారు కాదు. తల్లి పాలే సరిపోతాయని నమ్మేవారు. ఆ తర్వాత, కొంతమంది నిపుణులు ఆరేడు నెలల వయసు నుంచి అదనపు ఆహారం ఇవ్వవచ్చనే ప్రతిపాదన తీసుకొచ్చారు. నిజానికి ఘనాహారాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో కచ్చితమైన సమయాన్ని ఎక్కడా నిర్ధారించలేదు. బిడ్డ పెరుగుదల, తల్లిపాల లభ్యతపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది.
శిశువు మూడునెలల వయసులో చొల్లు కార్చడం ప్రారంభిస్తుంది. ఇదే సమయంలో పిండి పదార్థాలను జీర్ణం చేసే, అమైలేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి మొదలవుతుంది. ఇంకొన్ని రోజుల తర్వాత, శిశువు తల్లి రొమ్ము మొనలను కొరకడానికి ప్రయత్నిస్తుంది. దాంతోపాటు నోట్లో ఏదైనా ఆహారం ఉంచినట్టయితే, ఇంతకు ముందులా నాలుకతో బయటికి తోసేయదు. మింగడానికి ప్రయత్నిస్తుంది. ఆరు నెలల వయసులో చిగుళ్లు గట్టి పడటమూ మొదలవుతుంది. అంటే, ఘన పదార్థాలను జీర్ణించుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. తొమ్మిది నెలలు వచ్చేసరికి తనంతట తాను చేతితో నోటివద్దకు తీసుకెళ్తుంది. అప్పటికే, శిశువు బరువు ఆరేడు కిలోలకు చేరుకొని ఉంటుంది. ఇక, ఈ దశ నుంచీ తల్లిపాలు పెరిగే బిడ్డ అవసరాలను తీర్చలేవు. ఈ సమయంలోనే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించవచ్చు.
శిశువుకు ఇచ్చే ఘనాహారాన్ని చెంచాతో లేదా చేతితో ఇవ్వాలి. ద్రవాహారానికైతే ఉగ్గు గిన్నె సరిపోతుంది. కొందరు, పాలకు కొంచెం పొడి రూపంలో ఉండే ఆహారాన్ని కలిపి సీసాతో తాగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పని త్వరగా పూర్తవుతుందేమో కానీ, ఈ అలవాటు ప్రమాదకరం. సీసాతో ఘనాహారం తాగించడం వల్ల, అందులోనూ సీసా ఉపయోగించడం వల్ల అనేక వ్యాధులు (విరేచనాలు, వాంతులు) చుట్టుముట్టవచ్చు. చెవిలో చీము పట్టడం, దంతాలు పుచ్చిపోవడం లాంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సీసాకు బిగించిన పీకద్వారా ఆహారం నోట్లోకి రావాలంటే, ఆ పీక చాలా పలుచగా ఉండాలి. మరీ పలుచటి ఆహారం ఇచ్చినట్టయితే పోషక విలువలు తగ్గిపోయి, నాసిరకం ఆహారంతో కడుపు నిండిపోతుంది. పీక రంధ్రాలు మరీ పెద్దవిగా ఉంటే, త్వరత్వరగా నోట్లోకి వచ్చినప్పుడు శిశువు సరిగా మింగలేక ఇబ్బందిపడవచ్చు. వాంతి చేసుకోవచ్చు. పొరపాటున ఆహారం ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తే ఇంకా ప్రమాదం. అది న్యుమోనియాకు దారి తీయవచ్చు. కాబట్టి, చేతితోగానీ చెంచాతోగానీ తినిపించడం ఉత్తమం. ఇది, మాతా శిశు అనుబంధానికి కూడా ఎంతో ముఖ్యం. ఇలా తినిపించినప్పుడు కనిపించే ఆలనా లాలనా.. సీసాతో తాగించినప్పుడు ఉండదు. శిశువు నోట్లో సీసా పెట్టేస్తే చాలు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. దీంతో తల్లి ఏ ఫోన్లోనో మాట్లాడుకుంటుంది, వేరే పని చేసుకుంటుంది. దీనివల్ల ప్రేమతో ముద్దలు పెడుతూ, శిశువుతో కబుర్లు చెప్పుకునే అద్భుతమైన అవకాశాన్ని తల్లి కోల్పోతుంది. ఫలితంగా, శిశువు మానసికాభివృద్ధికి దోహదపడే ఓ ద్వారం మూసుకుపోతుంది. అది శిశువు భవిష్యత్తుపైనా కొంత ప్రభావం చూపుతుంది. సీసాతో ఆహారాన్ని తాగించడం వల్ల శిశువు పెరుగుదల, అభివృద్ధిలో ముఖ్య దశలు.. చప్పరించడం, కొరకడం, నమలడం సరైన సమయంలో అలవాటు కావు. దీనివల్ల పిల్లలు పెద్దయిన తర్వాత కూడా, తమ వయసుకు తగిన ఆహారం తీసుకోవడానికి అయిష్టత చూపుతారు. సీసాతో కొద్దిరోజులు తాగించి, ఆ తరువాత మాన్పించడానికి ప్రయత్నిస్తే.. శిశువు మార్పును ఇష్టపడదు. తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. సీసాతో పాలు తాగించడమే తప్పు. దాన్లో ఆహారం వేసి తాగించడం ఇంకా తప్పు. కాబట్టి, సాధ్యమైనంత వరకూ చెంచాతోనే తినిపించాలి.
కొంతమంది పిల్లలు ఆహారాన్ని నోట్లో పెట్టగానే ఆబగా తినేస్తారు. మరికొందరు అస్సలు తీసుకోరు. తిండి అనగానే ఏడుపు మొదలుపెడతారు. ఇంకా బలవంతంచేస్తే నోట్లోంచి ఉమ్మేస్తారు. వాంతి చేసుకొంటారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయమేమీ కాదు. ఇలాంటి సమయంలో అమ్మలకు సహనం, నేర్పు అవసరం. తాత్కాలికంగా ఆ ప్రయత్నం ఆపేసి, తల్లిపాలు తాగించాలి. తిరిగి ఐదారు రోజుల తరువాత మరొకసారి ప్రయత్నించి చూడాలి. కొందరు శిశువులు మొదట అయిష్టత చూపినా, కొంతసేపు తల్లిపాలు తాగించి మధ్యలో ఆహారం ఇస్తే తినడానికి ఆసక్తి చూపుతారు. ఫలానా ఆహారం మీద పదే పదే నిరాసక్తత చూపినప్పుడు, దానిని తాత్కాలికంగా పక్కనపెట్టి, మరొకదాన్ని ప్రయత్నించాలి. పెద్దల్లానే శిశువులకూ ఇష్టాయిష్టాలు ఉంటాయి. కొన్ని రుచులు నచ్చుతాయి, కొన్ని అస్సలు నచ్చవు. కానీ, క్రమంగా వాళ్లే సర్దుకుపోతారు. ఆ రోజు కోసం ఎదురుచూస్తూ కోరినంత, కోరినప్పుడు తినిపించాలే తప్ప.. ముక్కుమూసి, కాళ్లూ చేతులు విరిచి పట్టుకొని బలవంతంగా కడుపు నింపాలనుకొంటే శిశువుకు ఆహారంపై ఆసక్తి చచ్చిపోతుంది.ఉప్పు ముప్పు శిశువుకు పెట్టే ఏ ఆహారంలోనూ ఉప్పు కలుపరాదు. ఆహారంలో ఉప్పు జోడించడం వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువగా నీరు తాగడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. పసితనం నుంచే ఉప్పు ఇవ్వడం ప్రారంభిస్తే భవిష్యత్తులో అధిక రక్త పోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఉప్పు బిస్కెట్లు కూడ ఏడాది వయసుకు ముందు ఇవ్వకూడదు.
శిశువుకు పెట్టే ఏ ఆహారంలోనూ ఉప్పు కలుపరాదు. ఆహారంలో ఉప్పు జోడించడం వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువగా నీరు తాగడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. పసితనం నుంచే ఉప్పు ఇవ్వడం ప్రారంభిస్తే భవిష్యత్తులో అధిక రక్త పోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఉప్పు బిస్కెట్లు కూడ ఏడాది వయసుకు ముందు ఇవ్వకూడదు.
శిశువుకు తినిపించే ఆహారంలో చక్కెర, గ్లూకోజ్ కూడా కలుపవద్దు. దీనివల్ల ప్రతి ఆహారం తీపిగా తీసుకొనే దురలవాటు మొదలవుతుంది. తీపి పదార్థాలు మితిమీరి తినడం వల్ల, నోట్లో బ్యాక్టీరియా చర్య కారణంగా అవన్నీ ఆమ్లాలుగా మారి దంతాలను నాశనం చేస్తాయి. ఒకసారి మిఠాయిలకు అలవాటు పడితే, మిగతా రుచులపై ఆసక్తి చూపరు. చాక్లెట్లు, జెమ్స్, పెప్పరమెంట్లు కూడా దంత వినాశనానికి దారి తీస్తాయి. చిన్న పిల్లలకు తిన్న తర్వాత నోరు శుభ్రంగా పుక్కిలించి ఉమ్మేయడం చేతకాదు కాబట్టి, అసలు ఇవ్వక పోవడమే మంచిది. ఒకవేళ, ఎప్పుడో ఒకసారి ఇచ్చినా, తిన్న వెంటనే నీళ్లు తాగిస్తే నోరు శుభ్రపడుతుంది. కాస్త పులుపుగా ఉండే పండ్లరసాలు తాగడానికి ఇష్టపడకపోతే.. వాటిలో కొంచెం నీళ్లు కానీ, పాలు కానీ కలిపి ఇవ్వాలే కానీ గ్లూకోజ్, చక్కెర జోలికి వెళ్లకూడదు.
చిన్న పిల్లలకు మసాలాలు దట్టించిన ఆహారం అస్సలు పెట్టకూడదు. ఆ ఘాటువల్ల కండ్లలో నీరు కారవచ్చు. వాంతి కావచ్చు. ఆ తర్వాత కడుపులో మంట ఏర్పడవచ్చు. నొప్పి, విరేచనాలు కావచ్చు. కాబట్టి, ఇంట్లో వంట చేస్తున్నప్పుడు, మసాలాలు వేయకముందే పిల్లల కోసం కొంత పక్కన తీసి ఉంచడం ఉత్తమం.
మన శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది, శరీరంలోని మలినాల విసర్జన, శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ వంటివన్నీ నీటిద్వారానే జరుగుతాయి. మొదటి ఆరు నెలలు శిశువుకు ఏ విధమైన ద్రవపదార్థాలూ ఇవ్వాల్సిన పనిలేదు. తల్లిపాలే సరిపోతాయి. ఆరు నెలల తరువాత, అదనపు ఆహారం తినిపించినప్పుడు 2-3 చెంచాల నీరు ఇవ్వాలి. ఎండకాలంలో కొంత ఎక్కువ ఇవ్వడం మంచిది. నీటితోపాటు నారింజ, నిమ్మ, ద్రాక్ష, మామిడి రసాలు, కొబ్బరి నీరు, పుచ్చకాయ, ఖర్బూజ రసాలు తాగించవచ్చు.
పిల్లలకు వచ్చే వ్యాధులలో సగానికి పైగా ఆహారంద్వారానో, నీటి ద్వారానో శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవుల వల్ల వచ్చేవే. కాబట్టి, శిశువుకు పెట్టే ఆహారం చాలా శుభ్రంగా ఉండాలి. లేదంటే, అందులో హానికర సూక్ష్మజీవులు చేరిపోతాయి. బిడ్డ ఆరోగ్యమూ పాడైపోతుంది. మన దేశంలో సామాన్య ప్రజలు రోజుకు రెండుసార్లకు మించి వండుకోరు. కాబట్టి, వండిన ఆహారాన్ని శిశువు తినేవరకూ భద్రపరచాలి. వంటకాలను చల్లని ప్రదేశంలో, పరిశుభ్రంగా మూతపెట్టి ఉంచాలి. వండిన రెండు గంటలలోపు ఇవ్వడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. ఇది సాధ్యం కానప్పుడు, దానిని మరిగే వరకూ తిరిగి వేడిచేసి చల్లార్చి ఇవ్వాలి.
శిశువు జబ్బు పడినప్పుడు, కొందరు తల్లిదండ్రులు ‘లంఖణం పరమౌషధం’ అన్న సాకుతో జబ్బు పడ్డవారికి ఏ ఆహారం ఇవ్వకుండా కడుపు మాడ్చుతుంటారు. నిజానికి ఆరోగ్యవంతులతో పోలిస్తే, రోగులకే బలవర్ధకమైన ఆహారం అవసరం. వ్యాధి నుంచి కోలుకుంటున్న దశలో ఆకలి బాగా వేస్తుంది. అంతకుముందు కన్నా ఎక్కువ ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించాలి. పిల్లలకు ఆహారం ఇష్టం లేకపోతే తినిపించడం కష్టం కాబట్టి, వారికిష్టమైన ఆహారాన్నే మెత్తగా చేసి కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు ఇవ్వాలి.