మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మద్దతు పెరుగుతోంది. అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గ్రాడ్యుయేట్లందరూ సిద్ధమవుతున్నారు. నిన్నామొన్నటి వరకు కొంత అసహనంతో ఉన్న గ్రాడ్యుయేట్లు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ప్రస్తుతం ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు, ఔట్సోర్సింగ్ లెక్చరర్లతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు, న్యాయవాదులు, ప్రైవేట్ ఇంజినీర్లు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పోలీసులు అంతా టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ వాణీదేవికే మద్దతు తెలుపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యూనివర్సిటీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ అధ్యాపకులతో పాటు హోంగార్డులు టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ను కలిసి హామీ ఇవ్వడం ఇందుకు నిదర్శనం. దీంతో అన్ని కులసంఘాల వారీగా గ్రాడ్యుయేట్లపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాణీదేవికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ బీసీ కులాల రాజకీయ వేదిక ప్రకటించింది. ఈ మేరకు వేదిక కన్వీనర్ విజయేంద్రసాగర్, కో-కన్వీనర్లు శ్రీనివాస్పూసల, దూగుంట నరేశ్ప్రజాపతి, నాడపల్లి మాధవ్మేరు తమ మద్దతు పత్రాన్ని శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు అందజేశారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, గ్రాడ్యుయేట్లతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరవుతోంది. ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ, కుల, వృత్తి సంఘాలతో మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సమావేశమవుతున్నారు. సమస్యలను ఆలకిస్తూ.. పరిష్కారం చూపిస్తున్నారు. అందరి సమస్యలను అధికారంలో ఉన్న ప్రభుత్వమే తీరుస్తుంది తప్పా ఓడిపోయే పార్టీలు కాదని వివరిస్తున్నారు. ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతున్న పార్టీల భరతం పట్టాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ తన వ్యూహాత్మకమైన ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలే ఈ రోజు గ్రాడ్యుయేట్లు అందరూ ఏకతాటిపైకి రావడానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళా గ్రాడ్యుయేట్లు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా అనుహ్యంగా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రతిపక్షాలు పరేషాన్లో పడ్డాయి. ముఖ్యంగా బీజేపీకి పరాజయం తప్పదని తేలిపోయింది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ.. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి చేసిందేమీ లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టానికి చేసింది సున్నా అన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెన్నారెడ్డి ఊసే ఎక్కడ కనిపించడం లేదు. క్యాడర్ లేక ఈ పార్టీ నాయకులు డీలా పడ్డారు. ఇక తెలంగాణ టీడీపీ అభ్యర్థికి ఎవరు ఓటు వేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.