జలం లేనిదే జీవం లేదు. మొత్తం భూభాగంపై మూడు వంతుల నీరు ఉన్నా.. వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఏ యేడుకాయేడు తగ్గుతున్న వనరులతో సంక్షోభం ముంచుకొస్తున్నది. ఈ దుస్థితి నుంచి మానవాళి గట్టెక్కాలంటే అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించుకోవడం ఒక్కటే మార్గం. మరీ ముఖ్యంగా పైసా ఖర్చు లేకుండా కురిసే వాన నీటి సంరక్షణపై చర్యలు చేపట్టడం తక్షణావసరం. ఇదే విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వాన నీటి సంరక్షణ కోసం ఏకంగా ఓ ఉద్యాన వనాన్నే ఏర్పాటు చేసింది. ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ ప్రతి వర్షం బొట్టునూ ఒడిసి పడుతూ ఆదర్శంగా నిలుస్తోంది. అంతేకాక నగరవాసులు, విద్యార్థులకు ఈ విధానంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది – బంజారాహిల్స్, మార్చి 11
వాననీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు జలమండలి ఏర్పాటు చేసిన వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కు ప్రతీ ఒక్కరిని ఆకర్షిస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.51లో సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన ఈ పార్కును మంత్రి కేటీఆర్ రెండేండ్ల క్రితం ప్రారంభించారు. వర్షం నీరు పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన ఈ పార్కులో అనేక పద్ధతులను అవలంబిస్తున్నారు. వర్షం నీరుతో పాటు మురుగు నీటిని శుద్ధి చేసి వాడుకోవడం ఈ పార్కు ప్రత్యేకత. కేవలం భవనాలపై పడిన నీటిని మాత్రమే కాకుండా నేలమీద పడిన ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకేలా చేసేందుకు ఇటీవలే మరిన్ని విధానాలను ఏర్పాటు చేశారు. అంతేకాక పార్కులో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన, త్రీడీలో నీటి చుక్క భూమిలోకి ఇంకే విధానాన్ని వర్చువల్లో చూపడం.. వీడియో గేమ్స్ విద్యార్థులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.
వర్షం పడితే అది భూమిలోకి ఇంకాలనే స్పష్టమైన ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ ఉద్యానవనంలో తాజాగా పిల్ల కాలువలను నిర్మించారు. పార్కులోని పచ్చిక బయళ్ల నడుమ అధికారులు ఐదు కాలువలను ఏర్పాటు చేశారు. వాన కురిసినప్పుడు వంపులు తిరిగిన ఆ కాలువల ద్వారా వర్షపు నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పార్కులో ఔషధ మొక్కలు నాటారు. అంతేకాక వాటి వివరాలను తెలియజేస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. జ్యోతిశాస్త్రంలో చెప్పబడిన 12 రకాల రాశి ఫలాలకు చెందిన మొక్కలతో పాటు ఎర్రచందనం, అనంతమూల్, సప్తపర్సి, తెల్ల చమేలి, బొప్పాయి, పనస, కలబంద, కిర్ణి, కలిగొట్టు, తెల్లమందారం, మామిడి, బకుల, కదిర, రావి, అరటి మొక్కలను పెంచుతున్నారు.
వాన నీటి సంరక్షణ పద్ధతులు కండ్లకు కట్టినట్టు చూపించేలా ఏర్పాటు చేసిన ఈ పార్కులో మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్కులోని ఇంకుడు గుంతలు, ఇతర నిర్మాణాలతో ఎంత నీటిని భూమిలోకి పంపవచ్చో గణాంకాలతో సహా నగరవాసులకు విడమరిచి చెబితే మంచి ఫలితాలు ఉంటాయని వారంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి భవన నిర్మాణ సంస్థకు ఈ పార్కులో ఏర్పాటు చేసిన విధానాలపై అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలంటున్నారు.
వాన నీటిని భూమిలోకి ఇంకించేందుకు పార్కులోని అన్ని ప్రాంతాలను కలుపుతూ సరికొత్తగా పర్వియస్ పేవర్ బ్లాక్స్ను ఏర్పాటు చేశారు. వాకర్స్ నడిచే దారిలో నిర్మించిన అధికారులు వాటి మధ్యలో పచ్చదనాన్ని పెంచారు. రానున్న వేసవిలో నగరంలోని పలు ప్రాంతాల్లో పర్వియస్ పేవర్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తే వాన నీటిని సంరక్షించే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.