హైదరాబాద్ : ఇతర ప్రాంతాల్లో ఉండే పట్టభద్ర ఓటర్లకు తగిన రవాణా వసతులు కల్పించి ఓటర్లందరినీ పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు, మహబూబాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై రెండు జిల్లాల జడ్పీ చైర్మన్లు కుమారి ఆంగోతు బిందు, కుసుమ జగదీశ్, ఎన్నికల ఇంఛార్జీలు, పార్టీ నేతలతో మంత్రి బుధవారం నిమ్స్ హాస్పిటల్ నుండి వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. మంత్రి సత్యవతి రాథోడ్ కొవిడ్ భారిన పడి నిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 14వ తేదీ ఉన్నందున ఆలోపు ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లందరూ ఎక్కడెక్కడ ఉన్నారో విచారించి వారికి నిర్ధేశించిన పోలింగ్ కేంద్రానికి వచ్చే విధంగా చూడాలన్నారు. అవసరమైతే రవాణా సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఎన్నికల బాధ్యులంతా పోలింగ్ రోజు తప్పకుండా అందుబాటులో ఉండాలన్నారు. పట్టభద్రుల ఎన్నికలకు నమోదు చేసుకున్న ఓటర్లకు ముందే వారి పోలింగ్ కేంద్రం, పోలింగ్ వివరాలు పంపించాలని, ఓటు హక్కును వినియోగించుకోవడంలో వారికి ఎలాంటి సందేహాలు, ఇబ్బందులు రాకుండా చూడాలని పేర్కొన్నారు.