న్యూఢిల్లీ: కార్లు, ట్రాక్టర్ల విక్రయాలు ఊపందుకున్నా గత నెలలో ఆటోమొబైల్ సేల్స్ 13 శాతం పడిపోయాయి. ప్రత్యేకించి టూవీలర్, వాణిజ్య వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. గతేడాదితో పోలిస్తే విక్రయాలు డబుల్ డిజిట్ పడిపోయాయి. కార్లు, యుటిలిటీ వెహికల్స్ సేల్స్ 11 శాతం, ట్రాక్టర్ల విక్రయాలు 19 శాతం పుంజుకున్నాయి.
కానీ టూ వీలర్ విక్రయాలు 16 శాతం పడిపోయాయి. వాణిజ్య వాహనాల విక్రయాలపై ఇప్పటికి కరోనా మహమ్మారి పడగ నీడ వీడలేదు. వాణిజ్య వాహనాల విక్రయాలు 30 శాతం, త్రీ వీలర్స్ సేల్స్ 50 శాతం తగ్గుముఖం పట్టాయని కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది.
ప్రయాణ వాహనాల విక్రయాల్లో పురోగతి కనిపించిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ రిటైలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తెలిపింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి మినహా దేశంలోని 1,477 ఆర్టీవో కేంద్రాల్లో లభించిన గణాంకాల ఆధారంగా ఫాడా ఈ వివరాలు వెల్లడించింది. 2020 ఫిబ్రవరితో పోలిస్తే మొత్తం వివిధ రకాల వాహనాల విక్రయాలు 17,31,628 నుంచి 14,99,036 యూనిట్లకు పతనం అయ్యాయి.
ఓవరాల్గా ప్రయాణికుల కార్ల విక్రయాలు 2,29,734 యూనిట్ల నుంచి 2,54,058 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రాక్టర్ల విక్రయాలు 18.89 శాతం పెరిగి 51,602 నుంచి 61,351 యూనిట్లకు పెరిగాయి. టూ వీలర్స్ సేల్స్ 13,00,364 నుంచి 10,91,288 యూనిట్లకు పడిపోయాయి. కమర్షియల్ వాహనాల విక్రయాలు 83,751 నుంచి 59,020 యూనిట్లకు పరిమితం అయ్యాయి. ఇక త్రీ వీలర్స్ సేల్స్ 66,177 నుంచి 33,319 యూనిట్ల వద్ద స్థిర పడ్డాయి.