మేడ్చల్, మార్చి 8, (నమస్తే తెలంగాణ) మేడ్చల్ రూరల్ : ‘మహిళలు గొంతెత్తాలి.. హక్కుల కోసం నినదించాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాణించాలి’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీ య మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన కవిత మాట్లాడుతూ.. మహిళలు ముందడుగు వేయాలంటే గొంతు విప్పాలని, ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.
అగ్రశ్రేణి కంపెనీలైన గూగుల్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్లో మహిళా ఉద్యోగుల వాటా 25శాతమే ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచంలో ఉన్న పేటెంట్లలో మహిళలకు 2% మాత్రమే ఉన్నాయని తెలిపారు. ‘మహిళలు ఆలోచించలేరా? ఇన్నోవేషన్కు పనికిరారా? ఏటా వేల సంఖ్యలో మహిళా విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టభద్రులవుతున్నా.. ఈ పరిస్థితి ఎందుకున్నది? మహిళలు ఆలోచించాలి’ అని కవిత అన్నారు. పరిశ్రమ, వ్యాపారాన్ని స్థాపించిన మహిళ మరో 20 మంది నిస్సహాయ మహిళలకు సహాయం చేయాలని సూచించారు. ఎన్నో పోరాటాల తర్వాత మహిళలకు హక్కులు దక్కాయని.. వీటిని ఎలా సద్వినియోగించుకోవాలన్నది మనమీదనే ఆధారపడి ఉన్నదని చెప్పారు. ‘పొగరు అనుకున్నా.. ఇంకేం అనుకున్నా పర్వాలేదు కానీ.. అడిగే ప్రశ్న కరెక్టు అయినప్పుడు మహిళలు వెనుకడుగువేయకుండా వందసాైర్లెనా అడగాలి. అప్పుడు 365 రోజులూ మహిళా దినోత్సవాలు అవుతాయన్నారు.
మహిళలకు ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకు వస్తున్న సురభి వాణీదేవిని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మహిళల వల్లే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. వాణీదేవిని గెలిపిస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు కావ్య, ప్రణీత, దీపికారెడ్డి, పావని, లక్ష్మి, ఎంపీపీలు పద్మాజగన్రెడ్డి, అనిత, జడ్పీటీసీలు శైలజావిజయేందర్రెడ్డి, అనిత, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని, ఉద్యోగులు, నిరుద్యోగులకు సేవచేస్తానని సురభి వాణీదేవి కోరారు. విద్యాసంస్థల స్థాపనతో ఎంతోమంది ఉన్నతంగా ఎదగడానికి కృషిచేశానని తెలిపారు. ఆ అనుభవంతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు.