‘ఏడాది పాటు థియేటర్లు మూతపడటంతో అందరితో పాటు నాలో చిన్న భయం మొదలైంది. సినీ పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉంటుంది?థియేటర్లు మళ్లీ తెరచుకుంటాయా? ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాలు చూడటానికి వస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ తెలుగు ప్రేక్షకుల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. లాక్డౌన్ తర్వాత విడుదలైన సినిమాల్ని ఆదరిస్తూ మా భయాలను పోగొట్టారు’ అన్నారు అన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆదివారం హన్మకొండలో జరిగిన ‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దర్శకుడు. స్వప్న సినిమా పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘సినిమా అనేది వ్యాపారం. దర్శకుడి ఆలోచనల నుంచి పుట్టిన కథ నిర్మాత, హీరో ఆమోదంతో తెరరూపం దాల్చుతుంది. ఓ సినిమాపై నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, గాయకుల నుంచి… డ్రైవర్లు, లైట్మెన్ల వరకు వేలాది మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. కానీ ఈ వ్యాపారం మొత్తం సినిమాను ఎంతగానో ప్రేమించే ప్రేక్షకుల పైనే ఆధారపడి ఉంటుంది. నేను ముంబాయి వెళ్లినప్పుడు ‘తెలుగు ప్రేక్షకులు సినిమాల్ని చాలా ఇష్టపడుతారు. నటుల్ని ఎంతో ప్రేమిస్తారు’ అంటూ బాలీవుడ్ హీరోలు, దర్శకులు ప్రశంసిస్తుండేవారు. సినిమాల్లోకి రాకముందు మమ్మల్ని గుర్తుపట్టేవాళ్లు ఎవరూలేరు. కానీ ఇప్పుడూ తొలిరోజు నుంచి మేము నటించిన సినిమాల్ని చూడటానికి థియేటర్లకు వస్తున్నారు హీరోల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మా కోసం పోరాడుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో నేను మిడిలిక్లాస్ ఫండ్ ఏర్పాటుచేస్తే అభిమానులంతా నాకు అండగా నిలిచారు. సినిమా ద్వారానే మీ అందరి ప్రేమ నాకు దొరికింది. తెలుగు రాష్ర్టాల్లో థియేటర్లు పునఃప్రారంభం కాగానే చాలా సినిమాలు విడుదలయ్యాయి. గొప్ప విజయాల్ని సాధించాయి. ఎన్నో పాన్ ఇండియన్ సినిమాల ప్రకటనలు వచ్చాయి. ఆ అద్భుతాలన్నీ ఒక్క తెలుగు చిత్రసీమలోనే సాధ్యమయ్యాయి. తెలుగు ప్రేక్షకుల్ని బీట్ చేసే ఆడియన్స్ ఎక్కడ లేరని కాలర్ ఎగరవేసుకొని గర్వంగా చెబుతున్నా. ఈ సినిమాకు పనిచేసిన వారందరూ నాకు ఆత్మీయులు. మేమంతా కలిసి ఎన్నో కలలు కన్నా. కష్టాలు చెప్పుకున్నాం. అందరూ నా ఎదుగుదలలో కీలకభూమిక పోషించారు. నాగ్ అశ్విన్ ప్రోత్సాహం వల్లే నేను హీరో నయ్యాను. తొలినాళ్లలో నటుడిగా నాకు చాలా అవకాశాలు ఇచ్చాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో మంచి పాత్ర ఇచ్చాడు. అందరి కోసం కాకుండానీకు నచ్చినట్లుగా ఉండు, నీ ధర్మాన్ని నిర్వరిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్చేయమని ఎప్పుడూ చెప్పేవాడు. నాగ్ అశ్విన్ మాటలు నిరంతరం స్ఫూర్తినిచ్చేవి. దర్శకుడు అనుదీప్కు ఈసినిమా పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టాలి. అందరికి గుర్తుండిపోయే సినిమా అవ్వాలి’ అని అన్నారు. “ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ తర్వాత నేను హీరోగా నటిస్తున్న చిత్రమిది. యూట్యూబ్ వీడియోలతో మొదలైన నా ప్రయాణం హీరోగా ఈ స్థాయికి చేరుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. యువతరాన్ని మెప్పించే చిత్రమిది. విజయ్ దేవరకొండను థియేటర్ వర్క్షాప్లో మొదటిసారి కలుసుకున్నా. నాటకాలతో జర్నీని మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ జాతీయ స్థాయి హీరోగా విజయ్ పేరు తెచ్చుకున్నాడు. నా కష్టాలు, సంతోషాల్ని విజయ్తో పంచుకుంటాను. నేను నటించిన సినిమా వేడుకకు విజయ్ దేవరకొండ అతిథిగా రావడం ఆనందంగా ఉంది. అందరి కష్టాలను మరిపించే శక్తి నవ్వుకుంది. ఆ నవ్వులను మనస్ఫూర్తిగా పంచే చిత్రమిది’ అని నవీన్ పొలిశెట్టి తెలిపారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘ఏడాది క్రితమే సినిమా పూర్తయింది. ప్రేక్షకుల్ని నేరుగా కలిసి అందరి నవ్వులను ప్రత్యక్షంగా చూడాలనే ఇన్నాళ్లు వేచిచూశాం. ప్రతి ఒక్కరూ టీమ్గా ఏర్పడి కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది’ పేర్కొన్నారు. ఈ వేడుకలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.