జగిత్యాల : అర్హులైన ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం
అందుతున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని పెగడపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూ.2 కోట్ల 65 లక్షల అంచనా వ్యయంతో రహదారి విస్తరణ, సైడ్ డ్రైనేజీ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఏడేండ్ల పాలనలోనే 70 ఏండ్ల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే దిక్సూచి అని పేర్కొన్నారు. యువత సన్మార్గంలో పయనించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుందన్నారు. విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి నాణ్యమైన బోధన, భోజనం అందజేస్తుందన్నారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి తెలిపారు.