శంషాబాద్ రూరల్/మియాపూర్ : హైదరాబాద్,రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని సురభివాణీదేవికి మద్దతుగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నేతృత్వంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని నరే న్ గార్డెన్లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు , చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి ,కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్, మాధవరం రోజాదేవి, జగదీశ్వర్ గౌడ్, పూజితగౌడ్, హమీద్పటేల్, మంజులారెడ్డి, సింధుఆదర్శ్రెడ్డి, జూపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై లేని పోని అబద్ధాలను బీజేపీ ప్రచారం చేస్తున్నదని, వాటిని టీఆర్ఎస్ కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.తెలంగాణకు రావాల్సిన ఎన్నో ప్రాజెక్టులకు బీజే పీ ప్రభుత్వం గండి కొట్టిందన్నారు. అనంతరం ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ విద్యావంతురాలైన వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ గెలుపునకు కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గంలో 33వేలపై చిలుకు పట్టభద్రుల ఓటర్లున్నారని, ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి చొప్పున నియమించారన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
శంషాబాద్ మండలంలోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులు, పట్టభద్రులతో మంత్రి హరీశ్రావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్రావు హాజరై మాట్లాడు తూ తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ పరిశ్రమను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసి తెలంగాణకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడు సంవత్సరాల్లో పూర్తిచేసి కోటి ఎకరాలకు సాగునీరందించే దిశగా అడుగులు వేస్తుందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందన్నారు. పట్టభద్రులు, వేధావులు మద్దతు ఇచ్చి సురభివాణీదేవికి మొదటిప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో 93 మంది పోటీ చేస్తుండగా అందులో వాణిదేవి మాత్రమే మహిళగా పోటీ చేస్తున్నారని అందుకే మహిళా ఓటర్లు వాణిదేవికి మద్దతు ఇవ్వాలని కోరారు.
శంకర్పల్లి మండలంలోని ప్రొద్దటూరు గ్రామ శివారుల్లోని ప్రగతి రిసార్ట్స్లో చేవెళ్ల నియోజక వర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఆనాడు రాష్ట్రంలో కర్ఫ్యూలతో అంధకారమే ఉండేదని, నేడు ఆ దాఖలాలు లేవన్నారు.
2018లో ఎమ్మెల్యేగా, 2019 ఎంపీగా మల్కాజ్గిరి నుంచి రెండు సార్లు ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు తాజాగా మూడోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమిపాలై హ్యాట్రిక్ను సాధించబోతున్నారని, ఇది తథ్యమని మంత్రి హరీశ్రావు అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రరావు పట్టభద్రులను, వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని, పదవిపై ఏమాత్రం గౌరవం లేకుండా రాజకీయ కాంక్షతో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారన్నారు. అంతటా ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదన్నారు. ఉన్నత విద్యావంతురాలైన వాణీదేవి అధ్యాపకురాలిగా లక్షమంది గ్రాడ్యుయేట్లను తయారు చేసి సమాజానికి అందించారని, విద్యారంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న ఆమె భవిష్యత్లో ఆ రంగం అభివృద్ధికి మరింత కృషి చేయగలుగుతారని మంత్రి అన్నారు.
బడంగ్పేట: మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టు భద్రుల నియోజకవర్గం నుంచి మచ్చలేని కుటుంబం నుంచి వచ్చిన పీవీ నర్సింహారావు కూతురు సురభివాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ సందచెరువు కట్టపై మార్నింగ్ వాక్ చేస్తున్న పట్టుభద్రులను శుక్రవారం మంత్రి కలిసి సురభివాణీదేవిని గెలించాలని కోరారు. వాణీదేవి గురించి పట్ట భద్రులకు వివరించారు. అనేక సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగ కల్పనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉందన్నారు. రాష్ర్టానికి 14వేల కంపెనీలు తీసుకొచ్చి 14లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఐదేండ్లలో 1.32లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉద్యోగులకు ఎన్నడూ లేని విధంగా పదోన్నతులు ఇచ్చామన్నారు.