ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 19: జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్ శ్రీ సరస్వతి శిశుమందిర్లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఆదివారం ఎంపీ సోయం బాపురావ్, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్లో ప్రతి సంవత్సరం గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఉత్సవాల్లో హిందూ ఉత్సవ సమితి వారు తీసుకుంటున్న జాగ్రత్తలు, కృషిని అభినందించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్లోనే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర, గోపాల కృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 19: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఏకదంతుడికి డప్పుచప్పుళ్లు, మేళాతాళాల మధ్య భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. గణపతి బప్పా మోరియా.. గణేశ్ మహరాజ్కి జై.. అంటూ నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నంబర్ల ప్రకారం వినాయక విగ్రహాలను నిమజ్జనానికి పెన్గంగ వరకు తరలించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రేన్లు, విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం వరకు నిమజ్జనం కొనసాగింది.
జైనథ్, సెప్టెంబర్ 19: మండలంలోని డొల్లార వద్ద గల పెన్గంగ సమీపంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు గణేశ్ నిమజ్జనం కొనసాగింది. ఇందుకు సంబంధించి పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు.
బేల, సెప్టెంబర్ 19: మండలంలోని డోప్టాల, సిర్సన్న, అవల్పూర్, దహెగాం, పిట్గావ్ గ్రామాల్లో గణేశ్ నిమజ్జనం కనుల పండువగా నిర్వహించారు. వినాయక ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై బ్యాండ్ మేళాల మధ్య వీధుల గుండా ఊరేగించారు. గ్రామాల సమీపాన ఉన్న చెరువుల్లో నిమజ్జనం చేశారు.
నార్నూర్, సెప్టెంబర్ 19: నార్నూర్, గాదిగూడ మండలాల్లో మండపాల సభ్యుల ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. కార్యక్ర మంలో గ్రామపెద్దలు, మండప సభ్యులు,యువకులు ఉన్నారు.