ఆదిలాబాద్, అక్టోబర్ 18 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగుపై ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొందరు స్మగ్లర్ల ప్రోత్సాహంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా సాగు చేస్తుండగా, పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి వరుస దాడులు చేస్తున్నారు. మొక్కలను ధ్వంసం చేయడమేగాకుండా, కేసులు నమోదు చేస్తూ నిందితులను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే 62 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగుపై ఎక్సైజ్, పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో మారుమూల గ్రామాలు, ఏజెన్సీ పల్లెల్లో గుట్టు చప్పుడు కాకుండా కొందరు స్మగ్లర్ల ప్రోత్సాహంతో గంజాయినిని సాగు చేస్తున్నారు. దళారులు రైతులను మచ్చిక చేసుకొని వారికి ఎక్కువ ధరతో కొనుగోలు చేస్తామని చెబుతారు. ఆ తర్వాత కొంత డబ్బు ముట్టజెప్పుతారు. వారి మాయమాటలు నమ్మి రైతులు పత్తి, ఇతర పంటల్లో గంజాయిని సాగు చేస్తారు. పంట చేతికిరాగానే మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సైతం యువతతో పాటు పలువురు గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ఈ పంట సాగును అరికట్టడానికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ఆదిలాబాద్లో 31 మంది అదుపులోకి..
ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు వరుస దాడులు చేస్తూ గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్నారు. ఇంద్రవెల్లి, సిరికొండ, బజార్హత్నూర్, మండలాల్లో ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తూ గంజాయి సాగు నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసిన అధికారులు 2403 మొక్కలను ధ్వంసం చేశారు. ఇచ్చోడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 కేసులు నమోదు చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉట్నూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 10 కేసుల్లో 10 మందిని, ఆదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి 4 కేసుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇచ్చోడ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 853 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఉట్నూర్ స్టేషన్ పరిధిలోని 460 గ్రాములు ఎండు గంజాయితో పాటు 1201 మొక్కలు, ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో సాగవుతున్న 349 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని వరుస దాడులు చేస్తూ గంజాయి సాగును నియంత్రిస్తున్నామని ఈ పంటను సాగు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 15 మంది..
జిల్లాలోని తిర్యాణి, జైనూర్, సిర్పూర్-యు, కాగజ్నగర్, కెరమెరి, ఆసిఫాబాద్, లింగాపూర్, వాంకిడి ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుస్తున్నది. నెల రోజుల్లో 11 కేసులు నమోదు కాగా, 15 మందిని అరెస్ట్ చేసిన అధికారులు 422 మొక్కలు, 800 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు.
మంచిర్యాల జిల్లాలో 16 మంది..
గత నెల చివరి వారంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆయా జిల్లాల పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో గంజాయి సాగును అరికట్టేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేశారు. ఈ ఏ డాది ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదు చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న 3 కిలోల 40 గ్రామాలు స్వాధీనం చేసుకున్నారు.