శ్రీరాంపూర్, అక్టోబర్ 18: రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటూ రవాణా చేస్తున్నామని, కొరత ఏర్పడే ప్రసక్తే లేదని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత్తి పెంపుదలపై సోమవారం వీడియోకాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ఏడు సంవత్సరాలుగా తెలంగాణలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కేంద్రాల్లో సరిపడా నిల్వలు సమకూర్చామని, ఇకపై ఇదే విధంగా సరఫరా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలో సింగరేణి ఒప్పంద పరిశ్రమలకు బొగ్గు కొరత రాకుండా చూస్తామని చెప్పారు. రానున్న కాలంలో మరింత పెంచుతామన్నారు. ఏడేండ్లుగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సరిపడా నిల్వలు ఉంచి పీఎల్ఎఫ్ సాధిస్తూ దేశంలోనే 6వ స్థానంలో నిలిచిందనీ, రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో ఈ విద్యుత్ కేంద్రం తనవంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. సింగరేణిలో ఉత్పత్తి పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లక్ష్యాల మేర కోల్ ఉత్పత్తి, రవాణా చేస్తున్నామని తెలిపారు. ఇకపై రోజుకు 90 వేల టన్నుల రవాణాకు సిద్ధమయ్యామని, నవంబర్ నుంచి రోజుకు 2 లక్షల టన్నులు సరఫరా చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారు నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఇతర రాష్ర్టాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకూ బొగ్గు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.
సమర్థవంతంగా పనిచేద్దాం..
దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నందున వీటిని అధిగమించడానికి నవంబర్ నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సిన అవసరం ఏర్పడిందని, దీనికి సర్వసన్నద్ధం కావాలని సీఎండీపిలుపునిచ్చారు. విద్యుత్ కేంద్రాల్లో సరిపడా నిల్వలు లేనందున సింగరేణి సంస్థ ఉత్పత్తి, రవాణా పెంచాలని కోరుతున్నదని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి పెంచాలని కార్మికులను, అధికారులను కోరారు. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల అనుమతులు వెంటనే ఇస్తామని చెప్పారు. ఇది దేశంలో ఎదుర్కొంటున్న క్లిష్ట విద్యుత్ సంక్షోభ సమస్యని, దీనిని నివారించడానికి ప్రతి సింగరేణీయుడు తనవంతు బాధ్యత నిర్వహించాలన్నారు. ఇప్పటికే సంస్థ లక్ష్యాల మేర బాగా పనిచేస్తున్నదని, తద్వారా క్లిష్ట సమయంలో దేశానికి, రాష్ర్టానికి అండగా నిలవాలని సీఎండీ కోరారు. సమావేశంలో డైరెక్టర్లు చంధ్రశేఖర్, సత్యనారాయణ, ఈడీ (కోల్మూమెంట్) జే అల్విన్, అడ్వయిజరీ మైనింగ్ డీఎన్ ప్రసాద్, జీఎం (కోఆర్డినేషన్) కే సూర్యనారాయణ, అన్ని ఏరియాల జీఎంలు, పీవోలు తదితరులు పాల్గొన్నారు.