ప్రాణాలతో బయటపడ్డ మరొకరు
ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో కొట్టుకుపోయిన హరీశ్
వెతికినా దొరకని ఆచూకీ
పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులు
బోథ్, జూలై 18: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర జలపాతంలో పడి ఒకరు గల్లంతయ్యారు. జైనథ్ మండలం కరంజికి చెంది న గొనిశెట్టి హరీశ్, ఆదిలాబాద్కు చెందిన రమేశ్, మరో ఇద్దరితో కలిసి ఆదివారం పొచ్చెర జలపాతం తిలకించడానికి వెళ్లారు. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాహనాల పార్కింగ్ పక్కనున్న చెక్పోస్టును ఆనుకుని ఉన్న చిన్నపాటి ఒర్రెపై భారీగా వరద పారింది. జలపాతం వైపు నుంచి వస్తున్న హరీశ్, రమేశ్ దాటే ప్రయత్నం చేస్తుండగా, ప్రవాహం పెరగడంతో ఇద్దరు కొద్ది దూరం కొట్టుకుపోయారు. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో హరీశ్ ఒర్రెలో కొట్టుకుపోయి జలపాతం నీటి ధార పడే వైపు గల్లంతయ్యాడు. మధ్యలో ఎక్కడైనా చిక్కుకున్నాడని వెతికినా ఆచూకీ కనిపించలేదు. జలపాతంలో పడిపోయాడని స్థానికులు అనుమానిస్తున్నారు. రాత్రి సమయం కావడం, జలపాతం వద్ద భారీగా వరద వచ్చి చేరుతుండడంతో వెతకడం కష్టంగా మారింది. విషయం తెలుసుకున్న బోథ్ సీఐ నైలు, శిక్షణ ఎస్ఐ అరుణ్ జలపాతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.