ఆదిలాబాద్, అక్టోబర్ 17 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం ధాన్యం కొనాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ఎప్పటిలాగే ప్రతి గింజనూ సేకరించాలని నిర్ణయించి ఆదేశాలిచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 5.10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే పంట కోతలు ప్రారంభం కాగా, ఈసారి కూడా ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. కాగా, దొడ్డు వడ్లు కొనరంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో, సీఎం కేసీఆర్ అభయమివ్వడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ప్రత్యేక రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చింది. రైతులు ఎంతో కష్టపడి సాగుచేసిన పంటలు దళారులకు అమ్ముకొని రైతులు నష్టపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది వానకాలం పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. సోయాబీన్ పంట కొనుగోళ్లు ప్రారంభంకాగా, సీసీఐ ద్వారా పత్తిని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఉమ్మడి జిల్లాలో రైతులు పత్తి తర్వాత వరిని ఎక్కువగా సాగు చేస్తారు. పంట కోత దశకు రాగా, కొనుగోళ్ల విషయంలో దొడ్డు వడ్లు కొనరంటూ ప్రచారం జరగడంతో రైతుల్లో కొంత ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వారికి అండగా నిలిచారు. ఈ ఏడాది వానకాలంలో రైతులు పండించిన వడ్లను గత యాసంగి మాదిరిగా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఈ సీజన్లో సైతం గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పంటను సేకరించనున్నారు. ప్రతి కేంద్రంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతులు తమ పంటను విక్రయించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్లు అధికారులతో సమావేశాలు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో 512 కేంద్రాల ఏర్పాటు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్లో 2,80,853 ఎకరాల్లో వరి సాగు చేశారు. నిర్మల్ జిల్లాలో 1,15,000 లక్షల ఎకరాలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 51,623 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 1,14,230 ఎకరాల్లో పంట సాగవుతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.10 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లాలో 2.30 లక్షల మెట్రిక్ టన్నులు, నిర్మల్ జిల్లాలో 1.88 లక్షల మెట్రిక్ టన్నులు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 92 వేల మెట్రిక్ టన్ను పంట విక్రయానికి రానున్నది. ప్రభుత్వం ఈ ఏడాది ధాన్యానికి క్వింటాలుకు మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి రూ.1960, బీ గ్రేడ్ రకానికి రూ. 1940 ప్రకటించింది. కరోనా నేపథ్యంలో గ్రామాల్లోనే కొనుగోళ్లు జరుగనుండగా 502 కేంద్రాల్లో పంటను సేకరించనున్నారు. నిర్మల్ జిల్లాలో 182 కేంద్రాలు, మంచిర్యాలలో 250, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 70 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఐకేపీ సంఘాలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల ద్వారా గ్రామాల్లో కాంటాలు పెట్టి మద్దతు ధరతో వడ్లను కొంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వానకాలంలో రైతులు సాగు చేస్తున్న పంట వివరాలను వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటలు సాగు చేస్తున్నాడనే వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. వీటి ఆధారంగా వరి సాగు చేసిన రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేస్తారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు కరోనా నిబంధనలు పాటిస్తారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నం. కలెక్టర్ భారతీహోళికేరి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశాల మేరకు ముఖ్యంగా ధాన్యం తరలింపునకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో మూడు ట్రాన్స్పోర్టుల ద్వారా ధాన్యం తరలిస్తాం. ఇందుకు సంబంధించి త్వరలో టెండర్ కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే మిల్లుల్లో అన్లోడింగ్ వేగవంతంగా జరిపించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.
పది రోజుల్లో పంట కోస్త
సోన్, అక్టోబర్ 17 : నాకున్న ఐదెకరాల్లో వరి వేసిన. మరో పది రోజుల్లో కోతకు వస్తుంది. ఈ ఏడాది దొడ్డు వడ్లు కొనమని ఇది వరకు చెప్పిన్రు. కొంత భయమేసింది. ఇప్పుడు దొడ్లు వడ్లు కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చెప్పిన్రు. ఇగ మాకు ధైర్యమచ్చింది. సంతోషంగా ఉంది. పది రోజుల తర్వాత కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంట.
భరోసా వచ్చింది..
సోన్, అక్టోబర్ 17 : ఈ ఏడాది వానకాలం సీజన్లో దొడ్డు రకం వరి వేసిన. పంట మంచిగనే ఉంది. మరో వారంలో పంట కోస్త. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజనూ కొంటామని చెప్పిన్రు. ఇగ మాకు భరోసా వచ్చింది. మొన్నటి దాకా కొంటరో.. కొనరో.. అని భయపడ్డం. ఇప్పుడు ఇక రంది లేదు.