నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే
పల్లె ప్రగతిపై సమీక్షా సమావేశం
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 17: నిర్మల్ జిల్లాలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులతో మంచి ఫలితాలను సాధించామని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్మల్, భైంసా డివిజన్ పరిధిలోని గ్రామ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, మురుగు కాలువలు, శ్మశానవాటికలు, ఉద్యానవనాలు, బృహత్ ప్రకృతివనం పనులను సకాలంలోనే పూర్తి చేసిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతిలో చేపట్టిన పనుల్లో 90 శాతం పూర్తయ్యాయని మిగిలిన 10 శాతం నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఆన్లైన్ సేవలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు వందశాతం పన్నులను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.