చెన్నూర్/బెల్లంపల్లిరూరల్/తాండూర్/సీసీసీ నస్పూర్/మందమర్రి/కన్నెపల్లి/కాగజ్నగర్టౌన్/ ఆసిఫాబాద్/దహెగాం : తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలకు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం అన్నదానం చేశారు. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ కోలాటాలాడుతూ, మంగళహారతులతో మహిళలు పాల్గొన్నారు. మందమర్రి పట్టణంలో విగ్రహాలను మంచిర్యాల, గోదావరిఖని పట్టణాల సమీపంలోని గోదావరినదికి తరలించి నిమజ్జనం చేశారు. చెన్నూర్ పట్టణంలోని దుర్గామాత ఆలయం, అయ్యప్పస్వామి ఆలయాలతో పాటుగా పలు వాడల్లో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో, శ్రీఅన్నపూర్ణ సహిత సోమేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నస్పూర్ పట్టణంలో నాగార్జునకాలనీలోని శ్రీవిజయ కనకదుర్గా యూత్ ఆధ్వర్యంలో, బెల్లంపల్లి మండల కేంద్రంలోని శివాలయంలో, అచ్చలాపూర్, మాదారం త్రీ ఇైంక్లెన్, కాసిపేట, రేచిని, కొత్తపల్లి గ్రామాల్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జన శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. కన్నెపల్లి మండలంలోని జన్కాపూర్లోనూ నిమజ్జన శోభా యాత్రను ఘనంగా నిర్వహించారు. కాగజ్నగర్ పట్టణంలో దుర్గామాత విగ్రహాలను పెద్దవాగులో నిమజ్జనం చేశారు. సర్సిల్క్లో నిర్వహించిన శోభాయాత్రలో కోనేరు చారిటబుల్ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ, ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ పట్టణం లో శారదాదేవి, దుర్గా దేవి ఉత్సవ విగ్రహాలను వీధుల గుండా ఊరేగించారు. అనంతరం పెద్దవాగులో నిమజ్జనం చేశారు. గాంధీచౌక్లో దుర్గాదేవి మండపంలో ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే ఆత్రం సక్కు పూజలు చేశారు. దహెగాం మండలంలో రాళ్లగూడ, దహెగాం, గిరివెల్లి తదితర గ్రామాల్లో విగ్రహా లను పెద్దవాగు, ఎర్ర వాగుల్లో నిమజ్జనం చేశారు.