శ్రీరాంపూర్ /తాండూర్/మందమర్రి రూరల్ / యైటింక్లయిన్ కాలనీ, అక్టోబర్ 16: కార్మిక కుటుంబాలు, కోల్ బెల్ట్ ప్రజలు దసరా వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని 8 గనులు, కార్మిక కాలనీలల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్కే 6గనిపై మేనేజర్ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జీఎం సురేశ్-ఆశ దంపతులు పాల్గొని పూజలుచేశారు. శమీ పూజలు చేసి జమ్మి ఆకు కార్మికులకు, అధికారులకు ఇచ్చి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఆలయం ఆవరణలో జమ్మి చెట్టు నాటారు. శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 3గనిపై మైసమ్మ దేవాలయంలో మేనేజర్ రవికుమార్, సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వర్రెడ్డి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో దస రా ఉత్సవాలు నిర్వహించారు. తాండూర్ మండలం మాదారంలో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి, సర్పంచ్ ధరావత్ సాగరిక శమీపూజ నిర్వహించారు. మందమర్రి సింగరేణి మైదానంలో రామ్లీల వేడుకలు నిర్వహించారు. జీఎం చింతల శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు. యైటింక్లయిన్కాలనీలో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. వెంకటేశ్వర దేవాలయం, షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన వేడుకల్లో ఆర్జీ-2 జీఎం తన్నీరు వెంకటేశ్వర్రావు, ఎస్వోటూ జీఎం సందనాల సాంబయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొని శమీ పూజ నిర్వహించారు. అనంతరం వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాంలీలా కార్యక్రమంలో రావణాసురున్ని దహనం చేశారు.
దసరా ఉత్సవాలు విజయవంతంపై హర్షం
రామగిరి, అక్టోబర్ 16 : మండలంలోని సెంటినరీకాలనీలో ఉన్న రాణి రుద్రమదేవి స్టేడియంలో శుక్రవారం జరిగిన దసరా ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒకకరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఉత్సవ కమిటీ కన్వీనర్ నాగెల్లి సాంబయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ పుట్ట మధు, టీఆర్ఎస్ నాయకులు, సింగరేణి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు ఆర్థిక చేయూత అందించిన దాతల సహకారం మరిచిపోలేమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కో కన్వీనర్ సాయి శ్రీనివాస్, సంపత్ రెడ్డి, బత్తుల రమేశ్, రామారావు, శ్రీకాంత్ రావు, కేశవరావు, శ్రీనివాస రాజశేఖర్ రెడ్డి, సంతోష్, క్రాంతి, సతీశ్, చిరంజీవి, బొడ్డు వినయ్, సుధాకర్ ఉన్నారు.
వైభవంగా రాంలీలా కార్యక్రమం
మణుగూరు రూరల్, అక్టోబర్ 16 : మణుగూరు ఏరియాలో రాంలీలా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం తొలుత వేంకటేశ్వరాలయంలో జీఎం జక్కం రమేశ్ శమీ పూజలో పాల్గొన్నారు. అనంతరం భద్రాద్రి స్టేడియంలో ఎస్ఎంఈడబ్ల్యూఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టీ, బిస్కట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీవీకాలనీలోని భద్రాద్రి స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకలకు అతిథిగా హాజరయ్యారు. అనంతరం టీబీజీకేఎస్ నేతలు వీ ప్రభాకర్రావు, సామా శ్రీనివాసరెడ్డి, ఏరియా అధికారులు, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, సంఘాల నాయకులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.