ఆదిలాబాద్, అక్టోబర్ 16 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర సర్కారు నిరుపేద పిల్లలకు విద్యనందిస్తున్నది. ఈ మేరకు గురుకులాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన బోధన చేయిస్తున్నది. పదో తరగతి వరకు ఉన్న కస్తూర్బాల్లో క్రమంగా ఇంటర్ విద్యను ప్రవేశపెడుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68 కేజీబీవీలు ఉండగా, ఇప్పటికే 24 స్కూళ్లను అప్గ్రేడ్ చేసింది. తాజాగా మరో 10 పాఠశాలలకు అనుమతులు ఇవ్వగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
పేద విద్యార్థులకు కార్పొరేట్కు దీటుగా చదువు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు గురుకులాలు, కస్తూర్బాలు, మోడల్ సూళ్లను ఏర్పాటు చేస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. సన్నబియ్యంతో రుచికరమైన భోజనం పెడుతున్నది. విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి తగిన శిక్షణ, ఇతర అంశాల్లో సైతం ప్రోత్సాహం అందిస్తున్నది. ఒక్కో విద్యార్థికి ఏడాది రూ.1.25 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఉచితంగా పుస్తకాలు, నోట్బుక్కులు, కాస్మోటిక్ చార్జీలను సైతం ప్రభుత్వం ఇస్తున్నది. వీటితో పాటు విద్యార్థినులకు కరాటే, యోగా, చిత్రలేఖనం, వృత్తి విద్య కోర్సులను సైతం నేర్పిస్తున్నారు. కార్పొరేట్ స్థాయి విద్య అందుతుండడంతో గురుకుల పాఠశాలలకు పోటీ పెరిగింది. పట్టణాలతో పాటు గ్రామాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.
పది నుంచి ఇంటర్..
గతంలో కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో పదో తరగతి వరకు మాత్రమే చదువుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత ఇంటర్.. ఆ పై చదువులకూ వాటిలో అవకాశం కల్పించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 68 (కేజీబీవీ) కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలలు ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలో 17, నిర్మల్ జిల్లాలో 18, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15, మంచిర్యాల జిల్లాలో 18 ఉన్నాయి. గతేడాది వరకు ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్లో 7, నిర్మల్లో 7, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 4, మంచిర్యాల జిల్లాలో 6 పాఠశాలల్లో ఇంటర్ తరగతులు బోధించేవారు. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి మరో 10 స్కూళ్లను అప్గ్రేడ్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ అర్బన్, భీంపూర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, కెరమెరి, రెబ్బెన, సి ర్పూర్(టీ), సిర్పూర్(యూ), తిర్యాణి, మంచిర్యాల జి ల్లాలోని జైపూర్, నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ పాఠశాల ల్లో ఈ సంవత్సరం నుంచి ఇంటర్కు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ లెక్కన ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో 9, నిర్మల్ జిల్లాలో 8, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 10, మంచిర్యాల జిల్లాలో 7 పాఠశాలల్లో విద్యార్థినులకు ఇంటర్ చదువులు అందనున్నాయి. కా గా, నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కేజీబీవీలను అప్గ్రేడ్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.