ఎదులాపురం, అక్టోబర్ 16: పెట్రోల్ బంకుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించి ప్రజలకు భరోసా కల్పించాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. శుక్రవారం పోలీస్ పెట్రోల్ బంక్ నాలుగో వార్షికోత్సవం ఘనంగా జరుపుకొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజేశ్చంద్ర పెట్రోల్బంక్ కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విజయదశమి సందర్భంగా 16 మంది పెట్రోల్ బంక్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు నూతన వస్ర్తాలు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాహనదారులకు నాణ్యమైన డీజిల్, పెట్రోల్ అందజేసి ప్రజల్లో పోలీసులపై భరోసా కల్పించాలన్నారు. పెట్రోల్ బంక్ పనితీరుపై పోలీస్ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. పోలీస్ పెట్రోల్ బంక్నుంచి వచ్చే ఆదాయంతోనే పోలీసులకు అత్యవసర ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాస్రావు, సమయ్జాన్రావు, వినోద్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, విజయ్కుమార్, పట్టణ సీఐ పోతారం శ్రీనివాస్, రిజర్వ్ సీఐ సుధాకర్రావు, శ్రీపాల్, పెట్రోల్ బంక్ నిర్వాహకులు సంతోష్కుమార్, ఆరిఫ్ హుస్సేన్, రవి, రవీందర్, శ్రీనివాస్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి
ఎదులాపురం,అక్టోబర్16: నేరాలను కట్టడి చేయడానికి నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయాలన్ని తనిఖీ చేయడానికి వచ్చిన ఎస్పీకి డీఎస్పీ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. డివిజన్ స్థాయిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మేజర్ కేసుల దస్ర్తాలను పరిశీలించారు. డివిజన్ స్థాయిలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో డీఎస్పీ వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచాలని తెలిపారు. సిబ్బంది పనితీరును మరింత మెరుగు పరిచే విధంగా ఎప్పటికప్పుడు సూచనలు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో 5 ఎస్ విధానంతోనే నడుచుకోవాలని ఆదేశించారు. దస్ర్తాల క్రమబద్ధీకరణ, పెండింగ్, దర్యాప్తు కేసులు త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పకడ్బందీ బందోబస్తు నిర్వహణతోనే పండుగలు ప్రశాంత వాతావరణంలో ప్రజలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. నూతన డీఎస్పీ కార్యాలయం కోసం ప్రతిపాదనలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ కార్యాలయ సిబ్బంది కే జైపాల్, రవి, ఎల్ కిష్టయ్య, జే అంకుశ్ తదితరులు ఉన్నారు.