ప్రాథమిక దశలోనే గుర్తించే చర్యలు
ఇంటింటికీ వెళ్తున్న వైద్య సిబ్బంది
పరీక్షల అనంతరం అక్కడికక్కడే చికిత్స
అవసరమైతే దవాఖానలకు తరలింపు
ఆదిలాబాద్ జూలై 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం ప్రారంభం కావడంతో ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల 1న ప్రారంభం కాగా, సెప్టెంబరు నెలాఖరు వరకు కొనసాగించనున్నారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి సకాలంలో వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీస్తూ.. అక్కడికక్కడే చికిత్స చేస్తున్నారు. అత్యవసరమైతే దవాఖానలకు తరలించి, మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో కలుషిత జలాలు, దోమలు, ఈగలు ఇతర క్రిమీకీటకాల కారణంగా వివిధ రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్యశాఖ అధికారులు సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 16 ప్రాథమిక ఆర్యోగ కేంద్రాలు, 122 ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రతి నెలా ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 10 వేల మందికి వైద్యసేవలు అందుతాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీలో ప్రజలకు పీహెచ్సీ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. జిల్లాలో వానకాలం సీజన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
జిల్లాలో మారుమూల గ్రామాలు, ఏజెన్సీ గూడేలు ఎక్కువగా ఉండడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ, డయేరియా, తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వీటి నివారణకు పక్కా ప్రణాళికలను తయారు చేసి అమలు చేస్తున్నారు. కాగా, జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జూలై 1న ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటికీ వైద్యాధికారులు, సిబ్బంది వెళ్లనున్నారు. సెప్టెంబరు వరకు మూ డు నెలల పాటు ఈ సర్వే కొనసాగించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జూలై 1న సర్వే ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 276 గ్రామాల్లో వైద్యబృందాలు పర్యటించాయి. 13,728 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా, 534 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో 700 మంది వైద్య సిబ్బంది 57,358 ఇండ్లలో సర్వే నిర్వహించారు. 854 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే 150 మంది రికవరీ అయ్యారు.
ఇంటి వద్దే వైద్య సేవలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సూపర్ వైజర్, హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేస్తారు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ జర్వం, దగ్గు, జలుబు, ఇతర ఆరోగ్య పరమైన సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ప్రతి ఇంటిపై ఆర్ఎఫ్ఎస్ (ర్యాపిడ్ ఫీవర్ సర్వే అని రాసి) నంబరు వేస్తారు. ఆ గ్రామంలో ప్రతి కుటుం బం వివరాలను రాసుకుంటారు. జ్వరం ఉన్న వారికి అక్కడికక్కడే మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇతర సమస్యలు ఉన్న వారి శాంపిళ్లు సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపి పరీక్షిస్తారు. జ్వరాలు వచ్చిన వారికి అసరమైన మందులు ఇస్తారు. గ్రామాల్లో జ్వరాలు ఎక్కువగా ఉంటే వైద్యాధికారులు, సిబ్బంది వైద్యశిబిరం ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తారు. స్థానికులకు పరిసరాల పరిశుభ్రత, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యసేవలు, దోమ తెరల వాడకంపై అవగాహన కల్పిస్తారు. ఈ సర్వే వల్ల గ్రామాల్లో సీజనల్ వ్యాధులు నివారణ జరగడంతో పాటు అనారోగ్యంతో బాధడుతున్న వారికి సత్వరమే వైద్యసేవలు అందుతాయి.