పది రోజుల్లో కాకపోతే చర్యలు
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
బోథ్, జూలై 16 : అన్ని చోట్లా శ్మశానవాటికల పనులను పది రోజుల్లోగా పూర్తిచేయాలని, లేకపోతే చర్యలు తప్పవని సర్పంచ్లు, పంచాయతీ రాజ్ అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. మండలంలోని పొచ్చెర, పార్డీ(బీ), పార్డీ (కే) గ్రామాల్లోని శ్మశానవాటికల పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. సర్పంచ్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎందుకు ఆలస్యమవుతున్నాయని మండిపడ్డారు. స్థలాల ఎంపిక తీరుపై పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను తప్పుబట్టారు. ఒకటి, రెండు చోట్ల అసంపూర్తిగా ఉన్న పనుల కారణంగా వందశాతం నిర్మాణాలు పూర్తిచేయలేకపోతున్నామన్నారు. పదిరోజుల్లోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని స్థానిక అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో ఎస్ కిషన్, పీఆర్ డీఈఈ శైలేందర్, ఎంపీడీవో సీహెచ్ రాధ, మండల ప్రత్యేకాధికారి శ్రీధర్స్వామి, ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ బీ మల్లేశ్, మారుతి, ఎంపీటీసీలు డీ నారాయణరెడ్డి, మహేందర్, షేక్ నాసర్ అహ్మద్, బోథ్ సర్పంచ్ సురేందర్యాదవ్, మహిపాల్ ఉన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి…
అనంతరం బోథ్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ మొక్క నాటి, నీళ్లు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. అలాగే కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గార్డెన్ను పరిశీలించి, ఎంపీపీ తుల శ్రీనివాస్, ఎంపీడీవో సీహెచ్ రాధను కలెక్టర్ అభినందించారు. లాన్లో గడ్డి పెంపకం, చుట్టూ వివిధ రకాల మొక్కలు, మధ్యలో ఇటుకలతో చేసిన సెట్టింగ్ బాగుందని ప్రశంసించారు. మిగతా మండలాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దీనిని ఓ మోడల్గా తీసుకోవాలని డీఆర్డీవోకు సూచించారు.