భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 15: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గడ్డిగానిపల్లి గ్రామం తరలింపునకు రం గం సిద్ధమవుతున్నది. కేటీకే ఓసీ 2 విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం గడ్డిగానిపల్లి గ్రామాన్ని తరలించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఏడాది క్రితమే రిక్విజేషన్ పెట్టుకున్నది. అప్పటి నుంచి అధికారులు గ్రామాన్ని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. పక్కనే ఉన్న ఓసీ 2 తో చాలా ఇబ్బంది పడుతున్నామని, ఓసీ బ్లాస్టింగ్లతో ఇండ్లపై పెద్ద పెద్ద రాళ్లు పడుతున్నాయని, తమ గ్రామాన్ని తరలించాలని గ్రామస్తులు పదే పదే అధికారులకు విన్నవిస్తున్నారు. దీంతో అధికారులు ఎట్టకేలకు స్పందించి గడ్డిగానిపల్లి గ్రామంలో ఉన్న ఇండ్లకు, చెట్లకు, గుడిసెలకు నంబర్లు వేశారు. బుధవారం ఆర్డీవో శ్రీనివాస్, సింగరేణి అధికారులు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఎన్ని ఇండ్లున్నాయి.. చెట్లు, గుడిసెలు తదితర వివరాలను ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ఓసీ 2 విస్తరణ కోసం గడ్డిగానిపల్లి గ్రామాన్ని తరలించి, స్థలం అప్పగించాలని రిక్విజేషన్ పెట్టుకున్నదన్నారు. ప్రస్తుతం ప్రతి ఇల్లు తిరిగి సర్వే చేశామన్నారు. గ్రామంలో 551 ఇండ్లున్నాయని , మొత్తం ఇండ్లను ఇక్కడి నుంచి తరలిస్తామని పేర్కొన్నారు. వీరికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయడంతో పాటు 1000 క్వార్టర్ల సమీపంలో 70 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశామని తెలిపారు. ఈ స్థలాన్ని గడ్డిగానిపల్లి గ్రామస్తులకు వీలైనంత తొందరలో అప్పగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్ రాజు, రెవెన్యూ డీటీ శ్రీనివాసరావు, సర్వేయర్ నజీర్ , టీఆర్ఎస్ నాయకులు చల్లూరి సమ్మయ్య, సెగ్గం రాజసమ్మయ్య, జాడి కుమార్, బౌతు రాజేశ్, కొత్తపల్లి సుధాకర్, సెగ్గం రామయ్య పాల్గొన్నారు.