అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.45.71 కోట్లు
8,268 మంది రైతుల నుంచి 1,74,482 క్వింటాళ్లు సేకరణ
కరోనా కాలంలోనూ ఆర్థికంగా సర్కారు అండ
మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో ఆనందం
ఆదిలాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కరోనా కష్టకాలంలోనూ కర్షకులకు సర్కారు అండగా నిలిచింది. జొన్న ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసి.. డబ్బులు కూడా రైతన్నల ఖాతాల్లో వారం రోజుల వ్యవధిలోనే జమ చేసింది. క్రాప్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి దళారుల దందాకు కూడా చెక్ పెట్టింది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 8,268 మంది రైతుల నుంచి 1,74,482 క్వింటాళ్ల పంటను సేకరించింది. మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.45.71 కోట్లు జమ చేయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 33,955 ఎకరాల్లో జొన్న సాగైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో దిగుబడి బాగా వచ్చింది. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,620 మద్దతు ధర ప్రకటించగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.1,300లకే కొనుగోలు చేస్తుండడాన్ని సర్కారు గమనించి చర్యలు చేపట్టింది. కొనుగోళ్లలో పారదర్శకత పాటించడానికి క్రాప్ బుకింగ్ విధానాన్ని అమలు చేసింది. దీంతో సాగు వివరాలను వ్యవసాయశాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. వీటి ఆధారంగా రైతులు పండించిన పంట ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడంతో దళారుల దందాకు చెక్ పడింది.
1,74,482 క్వింటాళ్ల కొనుగోలు
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత నెల మొదటి వారంలో తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం కొనుగోళ్లను ప్రారంభించింది. 8,268 మంది రైతుల నుంచి 1,74,482 క్వింటాళ్లు సేకరించింది. పీఏసీఎస్ల ద్వారా 1,830 మంది రైతుల నుంచి 39,126 క్వింటాళ్లు, జైనథ్లో 533 మంది నుంచి 11,275, ఇచ్చోడలో 1,270 మంది నుంచి 28,604, బోథ్లో 2,147 మంది నుంచి 45,895, తాంసిలో 785 మంది రైతుల నుంచి 17,010, నార్నూర్లో 321 మంది రైతుల నుంచి 6,568, ఇంద్రవెల్లిలో 654 మంది రైతుల నుంచి 11,702, హస్నాపూర్లో 632 మంది రైతుల నుంచి 12,812, బేలలో 96 మంది రైతుల నుంచి 1,488 క్వింటాళ్ల పంటను మద్దతు ధరతో సర్కారు కొనుగోలు చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
రూ.45.71 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
రైతు వద్ద నుంచి పంటను కొనుగోలు చేసిన ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. క్వింటాలుకు రూ.2,620 మద్దతు ధరతో 1,74,482 క్వింటాళ్లకూ రూ.45.71 కోట్లను రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. జొన్నలు విక్రయించిన వారం, పది రోజుల్లోనే డబ్బులు రైతుల చేతికి రాగా.. వానకాలం సాగుకు ఇబ్బందులు లేకుండా పోయాయి. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం తమకు అండగా నిలిచి కొనుగోలు చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
పూర్తిస్థాయిలో కొనుగోళ్లు
యాసంగిలో రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేశాం. తొమ్మిది మార్కెట్ యార్డులలో మద్దతు ధర చెల్లించి, చివరి గింజ వరకు కొనుగోలు చేశాం. కొనుగోళ్లలో పారదర్శకత పాటించడానికి ఆన్లైన్ విధానం అమలు చేశాం. డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో పూర్తిస్థాయిలో జమ చేశాం.