ఉట్నూర్, అక్టోబర్ : సద్దుల బతుకమ్మ వేడుకలను ఉట్నూర్ డివిజన్లోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. చివరి రోజున రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి శోభాయాత్ర నిర్వహించారు. ఉట్నూర్ మండల కేంద్రంలో వివిధ వాడలకు చెందిన బతుకమ్మలను స్థానిక వినాయక్ చౌక్లో ఒక చోట చేర్చి ఆడిపాడారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రముఖులు హాజరయ్యారు. వక్తలు పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. వందలాది సంఖ్యలో బతుకమ్మలన్నీ ఒకే చోట ఉండటం కన్నుల పండువగా కనిపించింది. బతుకమ్మతో పాటు దుర్గాదేవి శోభాయాత్ర కూడా నిర్వహించారు. స్థానిక గంగన్నపేట చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో హిందు ఉత్సవ సమితి అధ్యక్షుడు బొడ్డు కిరణ్, ప్రధాన కార్యదర్శి బలిష్టి రామారావు, సభ్యులు పాల్గొన్నారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
నక్కలవాడలో
బోథ్, అక్టోబర్ 14: మండలంలోని నక్కలవాడలో గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. పటేల్ ఇంటి వద్ద తవ్విన గుంత వద్దకు బతుకమ్మలను తీసుకు వచ్చారు. పాటలు పాడుతూ, కోలాటాలు ఆడారు. ఎంపీపీ తుల శ్రీనివాస్, కవిత దంపతులు, ఎంపీడీవో సీహెచ్ రాధ గిరిజనులతో కలిసి బతుకమ్మ ఆడారు. సాయంత్రం సమీప వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొడప విజయ్, ఎంపీటీసీ గొడం జుగాదిరావు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు బీ శ్రీధర్రెడ్డి, నాసర్ అహ్మద్, మడావి గంగారాం పాల్గొన్నారు.