నేడు విజయదశమి
ఆలయాలు ముస్తాబు
రామ్లీలాకు ఏర్పాట్లు
మంచిర్యాల, (నమస్తే తెలంగాణ)/కాగజ్నగర్ టౌన్, అక్టోబర్ 14 : పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు, బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఆసరా చేసుకొని, ముల్లోకాలను పీడించసాగాడు. అతడి బాధల నుంచి విముక్తి కల్పించాలని దేవతలంతా త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు. త్రిమూర్తులు, మహిషాసురుడిని ఎదుర్కోవడం తమ వల్ల కాక, దుర్గామాతను వేడుకున్నారు. ఆమె తొమ్మిది రోజుల పాటు భీకర పోరాటం చేసి పదో రోజున మహిషాసురిడిని వధిస్తుంది. నాటి నుంచి విజయదశమి ఆనవాయితీగా వస్తున్నది.
పాండవుల కథ..
మరో కథ ప్రకారం.. అరణ్య, అజ్ఞాత వాసాన్ని పూర్తి చేసుకున్న పాండవులు ఆశ్వయుజ శుద్ధ దశమిన హస్తినాపురానికి చేరుకోగా, ప్రజలు వేడుకలు చేసుకున్నారు. అదే కాలక్రమేణా విజయదశమిగా మారిందని చెబుతారు. విజయదశమి వేడుకల్లో ఆయుధాలను, శమీవృక్షాన్ని పూజించేది కూడా ఈ కథను అనుసరించే! అడవిలో సహజంగా పెరిగే శమీ వృక్షం కొమ్మలను తీసుకొచ్చి గ్రామ చావడి, కాలనీల్లో, ఆలయాల ఆవరణల్లో ప్రతిష్ఠించి పూజిస్తారు. తర్వాత అందరూ అక్షింతలతో కలిపి, ఆ ఆకులను తీసుకొని బంధువులకు, పెద్దలకు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు.
సనాతన సంప్రదాయం..
తెలంగాణలో బతుకమ్మ, దసరాను ఘనంగా జరుపుకుంటారు. ఉపాధి, చదువు, ఇతర అవసరాల రీత్యా ఎక్కడెక్కడో నివాసముండే వారంతా ఈ పండుగల కోసమని సొంత గ్రామాలకు చేరుకుంటారు. ఆడబిడ్డలు, అల్లుళ్లు, కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. పిండి వంటలు ఆరగిస్తారు. ఇదే రోజు పాలపిట్టను చూస్తే ఏడాది పొడవునా శుభం కలుగుతుందని విశ్వాసముండగా, గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లి పాలపిట్టను చూస్తారు.
ఆయుధ పూజ ప్రత్యేకం
దసరా రోజు యంత్రం, వాహన, పనిముట్లను పూలతో అలంకరించి, పూజలు చేస్తారు. ఇందుకోసం ఆలయాల వద్ద వాహనాలతో బారులు తీరుతారు. ఆలయ అర్చకులతో పూజలు చేయించుకొని, తృణమో ఫణమో సమర్పిస్తారు.
ఆలయాలు ముస్తాబు..
దసరా ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా ఆలయాల వద్ద జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. రావణాసురుడి దిష్టి బొమ్మలను దహనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.