ఆదిలాబాద్, అక్టోబరు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను చకచకా కొనసాగిస్తున్నారు. గత నెల 16న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. అర్హులందరూ టీకా తీసుకునేలా అధికారులు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని 645 గ్రామాల్లో మొదటిడోస్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయ్యింది. మొత్తంగా 80 శాతం టీకా వేసినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. మిగతా ప్రాంతాల్లో సైతం ఈ నెలాఖరు వరకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెబుతున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్కు అనూహ్య స్పందన వస్తున్నది. టీకా పంపిణీలో భాగంగా రెండు జిల్లాల్లో 400 వైద్య బృందాలు పట్టణాలు, గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన వారందరూ టీకా తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం వార్డులు, గ్రామీణ ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైద్యశాఖతో పాటు మెప్మా, డీఆర్డీవో, పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందితో కూడిన బృందాలు ఇంటింటా తిరుగుతూ వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. అర్హులై ఉండి టీకా తీసుకోని వారు ఉంటే సెంటర్కు తీసుకెళ్లి టీకా ఇప్పిస్తున్నారు. రెండు జిల్లాల్లోని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రారంభంలో మందకోడిగా జరిగినా అధికారులు తీసుకుంటున్న చర్యలు కారణంగా క్రమంగా వేగం పుంజుకుంది. వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తుండడంతో టీకా తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
645 గ్రామాల్లో వందశాతం..
ఆదిలాబాద్, నిర్మల్ జిలాల్లోని 645 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి తచేసినట్లు వైద్యాశాఖ అధికారులు తెలిపారు. మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్కు సమయం పూర్తయితే వారికి సైతం టీకా ఇస్తున్నారు. రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు 4,48,891 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 2,47,686 మంది టీకా తీసుకోగా, ఇందులో 2,25,939 మంది మొదటి డోస్, 21,747 మంది రెండోడోస్ తీసుకున్నారు. జిల్లాలోని 255 గ్రామాల్లో వైద్యాశాఖ అధికారులు వందశాతం టీకాలను పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో 2,01,205 మందికి వ్యాక్సిన్ ఇవ్వగా ఇందులో 1,75,420 మంది మొదటి డోస్, 25,785 మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. జిల్లాలో 390 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. కేటాయించిన గ్రామాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేసిన సిబ్బందిని అధికారులు అభినందిస్తున్నారు. రెండు జిల్లాల్లో సైతం అన్ని గ్రామాల్లో త్వరలో వందశాతం టీకా పంపిణీ పూర్తి చేస్తామని వైద్యశాఖ అధికారులు తెలిపారు.