బోథ్, అక్టోబర్ 14: మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలతో గురువారం సాయంత్రం శోభాయాత్ర నిర్వహించారు. బోథ్, కౌఠ (బీ), ధన్నూర్ (బీ), కన్గుట్ట, మర్లపెల్లి, పొచ్చెర, కరత్వాడ, కుచ్లాపూర్లో దుర్గామాత విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లలో శోభాయాత్రకు నిమజ్జనానికి తరలించారు. మహిళలు కోలాటాలు ప్రదర్శించారు. ఆయా గ్రామాల్లో సాయంత్రం మొదలైన శోభాయాత్ర అర్ధరాత్రి వరకు కొనసాగింది. సమీప వాగుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. మండలపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
సిరికొండ, అక్టోబర్ 14 : మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను గురువారం సాయంత్రం శోభాయాత్ర నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహిళా భక్తులు దుర్గామాతకు ఎనిమిది రోజులు వైభవంగా పూజలు చేశారు . చివరి రోజు దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కోలాటాలు, నృత్యాలతో శోభాయాత్ర నిర్వహించారు. అర్ధరాత్రి కొండాపూర్ వాగులో నిమజ్జనం చేశారు. ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు , గ్రామస్తులు పాల్గొన్నారు
భీంపూర్, అక్టోబర్14: మండలంలోని పిప్పల్కోటి, కరంజి(టీ), అంతర్గాం, అర్లి(టి), వడూర్, నిపాని తదితర గ్రామాల్లో గురువారం సాయంత్రం దుర్గామాత శోభాయాత్రలు మొదలై శుక్రవారం తెల్లవారుజామున ముగిశాయి. డప్పువాయిద్యాల నడుమ గ్రామస్తులు సమీప పెన్గంగ, వాగులు, చెరువుల్లో అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు. పిప్పల్కోటి దుర్గామాత మండపంలో ముస్లింలు వంటలు చేశారు. వారికి మండపం నిర్వాహకులు కృతజ్ఞత లు తెలిపారు. నిర్వాహకులను వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్ కేమ కళ్యాణి, గ్రామస్తులు సన్మానించారు.
దుర్గామాతకు పట్టువస్ర్తాల సమర్పణ
నేరడిగొండ, అక్టోబర్ 14 : మండలంలోని కుమారి గ్రామంలో దుర్గామాతకు జడ్పీటీసీ జాదవ్ అనిల్ గురువారం పట్టువస్ర్తాలు సమర్పించారు. భక్తులు గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారికి కానుకలు సమర్పించారు. వేదపండితుడు శ్రావణ్కుమార్ భక్తులతో ప్రత్యే క పూజలు చేయించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజుయాదవ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, నేరడిగొండ, కుమారి వీడీసీ చైర్మన్లు రవీందర్రెడ్డి, తులసీదాస్, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, ఎంపీటీసీ సవిత, ఉప సర్పంచ్ నరేశ్రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నానక్సింగ్, మాజీ సర్పంచ్ అడెల్లు, నాయకులు చంద్రశేఖర్యాదవ్, అరుణ్ కుమార్గౌడ్, దుర్గాదేవి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
జైనథ్, అక్టోబర్ 14: మండలంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జైనథ్, కూర, దీపాయిగూడ, భోరజ్, మాకోడ, లక్ష్మీపూర్ తదితర గ్రామాల్లో దుర్గామాత, శాదరమాతకు పూజలు చేశారు. మండలంలోని కూర గ్రామంలోని దుర్గామాత మండపంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ ప్రత్యేక పూజలు చేశారు.
గుడిహత్నూర్,అక్టోబరు 14: మండలంలో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లో గురువారం హోమాలు చేశారు. మండల కేంద్రంలోని జవహర్నగర్,హనుమాన్నగర్ కాలనీల్లో మండపాల్లో భక్తులు హోమాలు నిర్వహించారు. తోషంలో మహిళలు కుంకుమార్చన చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.