ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
అంకెన, రాయదారి, పోచంపల్లిలో సందర్శన
అభివృద్ధి పనుల పరిశీలన
పెంబి, జూలై 14 : పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ పట్టిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన అంకెన, రాయదారి, పోచంపల్లి గ్రామాలను బుధవారం వారు సందర్శించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామాల్లో నెలకొన్న విద్యుత్, అటవీ సమస్యలను గ్రామస్తులకు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రాయదారి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం గిరిజన తండాలు, గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి, అభివృద్ధికి కృషిచేస్తుంటే అధికారుల పనితీరు సరిగాలేదన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. రాయదారి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్తో పాటు సబ్స్టేషన్ మంజూరుకు కృషిచేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాసిమెట్ల-కొరకంటి గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి కృషిచేస్తామని, అటవీశాఖ అనుమతులు ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. ఆ శాఖ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరా లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఏడీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్రామంలో విద్యుత్ స్తంభాలకు కావాల్సిన బడ్జెట్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా కవిత, జడ్పీటీసీ జానుబాయి, డీపీవో వెంకటేశ్వర్రావు, ఆర్డీవో రాథోడ్ రమేశ్, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీవో సాయన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పుప్పాల శంకర్, వైస్ఎంపీపీ గంగారెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు భూక్యా గోవింద్, సర్పంచ్లు మహేందర్, జాదవ్ కల్పన, లీలాబాయి, సూర్యబాను, పూర్ణచందర్గౌడ్, అయా శాఖల అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.