ఉమ్మడి జిల్లాలో 5,73,352 మంది లబ్ధిదారులు
రూ.858.88 కోట్లు పంపిణీ
కరోనా కాలంలోనూ అన్నదాతకు సాయం
రైతుల హర్షాతిరేకాలు
ఆదిలాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి:మాక్కూడా కేసీఆర్ వంటి సీఎం కావాలంటున్నరు..నా పేరు ఉయికె షేక్. నేను ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అందర్బంద్లో ఎవుసం జేత్త. నాకు నాలుగెకర్ల జాగుంది. ఆనలు బాగా పడుతున్నయ్. పత్తి, కంది ఏయాలనుకుంటున్న. రేపు(మంగళారం) సీఎం కేసీఆర్ సాబ్ 20 వేల రూపాల రైతుబంధు పైసలేత్తడు. నా బేంక్ ఖాతాలో పడుతయ్. దుకాన్లకు పోయి ఇత్తనాలు కొంట. ఇగ, మాకు మహారాష్ట్రలోని కొటారిలలో సుట్టాలున్నరు. గీ రైతుబంధు ముచ్చట ఇని ఆళ్లు తారీఫ్(మెచ్చుకోవడం) జేస్తున్నరు. మీరు అదృష్టవంతులంటున్నరు. మీలెక్క కేసీఆర్ వంటి సీఎం మాక్కూడా ఉంటే బాగుండు అంటున్నరు.రైతుబంధు.. చరిత్రలో ఏ ప్రభుత్వమూ తలచని, ఏ నాయకుడి ఊహకు అందని, తలపెట్టని పథకం.. అందుకే, దేశంలో అనేక రాష్ర్టాల ప్రభుత్వాలు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే కాపీ కొట్టింది. ఈ రైతుబంధే నేటి కరోనా కష్టకాలంలోనూ రైతన్నకు కొండంత అండగా నిలుస్తున్నది. పెట్టుబడికి ఢోకా లేకుండా చేస్తున్నది. ఆర్థిక భరోసా ఇస్తున్నది. వడ్డీ వ్యాపారుల దగ్గరకు పోకుండా మనోధైర్యంతో ఎవుసం బాటపట్టేందుకు దోహదపడుతున్నది. ఈ వానకాలం పంటకు కూడా డబ్బులు వేస్తామని పక్షం రోజుల క్రితమే సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నట్లుగానే నేడు(మంగళవారం) రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి.
దిలాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సర్కారు రైతులకు పెట్టుబడి సాయం మే 10, 2018 నుంచి రైతుబంధు పేరిట అందిస్తున్నది. మొదటి విడుతగా ఎకరానికి రూ.4వేల చొప్పున.. యేడాదికి రెండు దఫాలుగా రూ.8 వేలు చెల్లించారు. మొదటి విడుతలో చెక్కుల ద్వారా సాయం అందించగా.. 2018 డిసెంబర్లో యాసంగి నుంచి రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నారు. 2018 జరిగిన ఎన్నికల హామీలో భాగంగా సాయాన్ని ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు దఫాలుగా రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. 2019-20 వానకాలం నుంచి పెంచిన పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 2018-19లో వానకాలం, యాసంగికి రెండు విడుతలుగా రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. తర్వాత ఎకరానికి రూ.5 వేల చొప్పున వానకాలం, యాసంగిలో రెండు విడుతల్లో ఇచ్చారు. అప్పటి నుంచి యేడాదికి రెండు పంటలకు రెండు దఫాలుగా రూ.10 వేలు రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. కాగా.. నేటి(మంగళవారం) నుంచి వానకాలం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
5.73 లక్షల మంది రైతులకు ప్రయోజనం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 5,73,352 మంది రైతులు లబ్ధిదారులుగా ఉండగా.. ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.858.88 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 1,47,026 మంది రైతులు ఉండగా.. రూ.276.48 కోట్లు, నిర్మల్ జిల్లాలో 1,70,994 మంది రైతులు ఉండగా రూ.221.50 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 1,40,807 మంది రైతులు ఉండగా.. రూ.165.90 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,14,525 మంది రైతులకు రూ.195 కోట్లను సర్కారు రైతులకు అందించనుంది. గతేడాది యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం ఎకరాకు రూ.5 వేలను ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్ పారంభం కాగా రైతులు విత్తనాలు వేయడం ప్రారంభించారు. పత్తి, కంది, సోయాబీన్ విత్తనాలు వేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో రైతుబంధు డబ్బులు పంపిణీ చేయడంపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో డబ్బులు ఉండడంతో తమకు నచ్చిన నాణ్యమైన విత్తనాలు ఎరువుల కొనుగోలు చేస్తామని, సర్కారు అందిస్తున్న సాయంతో పంటకు అవసరమైన పెట్టుబడి పెట్టి అధిక దిగుబడులు సాధిస్తామని రైతులు పేర్కొంటున్నారు.
కష్టకాలంలో అన్నదాతకు అండగా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదిహేను నెలలుగా కరోనా కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. క్రమంగా రైతుబంధు డబ్బులను పంపిణీ చేయడంతోపాటు విత్తనాలు, ఎరువుల కోసం రైతులకు సకాలంలో అందించేలా చర్యలు చేపట్టింది. కరోనాతో రైతులు పంటల విక్రయాల్లో ఇబ్బందులు పడకుండా గ్రామాల్లోనే వడ్ల కాంటాలు ఏర్పాటు చేసింది. ఇటీవల యాసంగిలో రైతులు పండించిన జొన్నలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. వానకాలం సీజన్ ప్రారంభకావడంతో నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టింది. పోలీస్, వ్యవసాయశాఖ అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి కల్తీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. కష్టకాలంలో సర్కారు తమకు అండగా నిలువడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.