ఇండ్లకే పరిమితమైన ప్రజలు
6 నుంచి 10 వరకే కార్యకలాపాలు
సరిహద్దు చెక్పోస్టుల్లో కొనసాగిన తనిఖీలు
మంచిర్యాలలో జ్వర సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్ రావు
ఐబీ చెక్పోస్ట్ను సందర్శించిన ఎమ్మెల్యే చిన్నయ్య, డీసీపీ
ఆదిలాబాద్, నిర్మల్లో పర్యవేక్షించిన ఇన్చార్జి ఎస్పీలు
ఆదిలాబాద్, మే 14 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కట్టడిలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ మూడో రోజూ శుక్రవారం విజయవంతమైంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు తమ పనులు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రధాన వీధులు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కాగా సరిహద్దు చెక్పోస్టులతో పాటు అన్ని ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు లాక్డౌన్ తీరును పర్యవేక్షించారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో లాక్డౌన్ మూడో రోజు శుక్రవారం పకడ్బందీగా కొనసాగింది. రంజాన్ సందర్భంగా ముస్లింలు తమ ఇండ్లల్లోనే ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉండడంతో ప్రజలు తమకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్దకు చేరుకున్నారు.10 గంటలు దాటగానే వ్యాపారులు దుకాణాలు మూసివేయగా, జనం ఇళ్లకు చేరుకున్నారు. దీంతో అప్పటి వరకు రద్దీగా ఉన్న రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆదిలాబాద్, నిర్మల్ ఎస్పీలు జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. అత్యవసర సేవలను లాక్డౌన్ నుంచి మినహాయించారు. మూడోరోజు సైతం ప్రజలు లాక్డౌన్కు తమ సంపూర్ణ సహకారం అందించారు. 10 గంటలకు విధుల్లోకి చేరిన పోలీసు సిబ్బంది జనం ఇష్టానుసారంగా రోడ్ల పై తిరుగకుండా చర్యలు తీసుకున్నారు. పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు.
మూడో రోజూ ప్రశాంతం
మంచిర్యాల, మే 14, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ మూడో రోజూ ప్రశాంతంగా కొనసాగింది. ప్రభుత్వం సూచించిన మేరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు కొవిడ్ నిబంధనల మధ్య తమ కార్యకలాపాలు కొనసాగించారు. 10 గంటల తర్వాత వ్యాపారులు కూరగాయల మార్కెట్, దుకాణాలను మూసివేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వైరస్ వ్యాప్తిలో భాగంగా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవా విభాగాలకు చెందిన వారు విధులకు హాజరయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై పోలీసులు జరిమానా విధించారు. చెన్నూర్ పట్టణంలోని చెక్పోస్టుతో పాటు కోటపల్లి మండలంలోని రాపనపల్లి-సిరొంచ అంతర్రాష్ట్ర చెక్ పోస్టును జైపూర్ ఏసీపీ నరేందర్ పరిశీలించారు. తాండూర్ ఐబీ పోలీస్ చెక్ పోస్టును మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనిఖీ చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జిల్లాకేంద్రంలో మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. మంచిర్యాలలోని రాంనగర్లో నిర్వహించిన ఇంటింటా సర్వేలో ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యలపై పలువురిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా లాక్డౌన్కు సహకరించడంతో ప్రశాంతంగా కొనసాగింది.