కాన్పుగదిలోకి తల్లి, మహిళలకు అనుమతి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు దవాఖానల్లో అమలు
గర్భిణులపై ఒత్తిడి, ఆందోళన దూరం
సుఖ ప్రసవాలకు అవకాశం
మాతాశిశు మరణాలు తగ్గించేందుకు దోహదం
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్రతి అమ్మకు కాన్పు పునర్జన్మతో సమానం.. గర్భిణిలో ఒత్తిడి, భయం, ఆందోళనతో కలిగే ‘వేదన’ ప్రసవం సమయంలో ఇబ్బంది కలిగిస్తుంటుంది. ఇలాంటప్పుడే ధైర్యం చెప్పి, ఓదార్పునిచ్చేందుకు తోడు అవసరం. దీనిని గుర్తించిన వైద్యులు దవాఖానల్లో ‘బర్త్ కంపానియన్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. పురిటి గదిలోకి ఆత్మీయులను అనుమతినిస్తూ, సుఖ ప్రసవమయ్యేలా చూస్తున్నారు. కుమ్రం భీం జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ ప్రభుత్వ దవాఖానల్లో ఈ విధానం అమలు చేస్తుండగా, సత్ఫలితాలు వస్తున్నాయి. మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు ఈ విధానం దోహదం చేస్తున్నదని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.
మాతా శిశు మరణాలు ఎక్కువగా నమోదయ్యే దవాఖానల్లో ‘బర్త్ కంపానియన్’ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ విధానం జిల్లాలో రెండు దవాఖానల్లో అమలవుతుండగా, సత్ఫలితాలు వస్తున్నాయి. కాన్పు సమయంలో పురిటి గది (లేబర్రూం) లోనికి దవాఖాన సిబ్బందిని తప్పా, ఇతరులను అనుమతించే వారు కాదు. దీంతో గర్భిణికి ప్రసవ సమయంలో కలిగే ఒత్తిడి, ఆందోళన ఎక్కువై అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ కారణంగా మాతాశిశు మరణాలు చోటు చేసుకుంటున్నట్లు వైద్యులు గుర్తించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి మనసు ఓదార్పుని కోరుకుంటుంది. ‘నేనున్నాను’ అనే భరోసా ఇచ్చే వారికోసం తహతహలాడుతుంది. అలాంటి వాళ్లు కనిపించగానే ధైర్యం వస్తుంది. ఈ సూత్రం ఆధారంగానే ‘బర్త్ కంపానియన్(పుట్టుకకు తోడు)’ విధానం అమల్లోకి వచ్చింది. గర్భిణిలో ఒత్తిడి, భయం, మానసిక ఆందోళన ఉంటే నొప్పులు రావడానికి అవసరమైన ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల కాదు. ఈ హార్మోన్ విడుదల అయ్యేలా వైద్యులు సూది మందులు ఇస్తుంటారు. కానీ తల్లి, ఇతర ఆత్మీయులు తోడుగా ఉండి, చేయి పట్టుకోవడం, తల నిమరడం లాంటివి చేస్తుంటే, ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ త్వరగా విడుదలై సాధారణ నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశముంటుందనీ, కాన్పు సులభమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
సుఖ ప్రసవాలు పెరిగాయి..
బర్త్ కంపానియన్ విధానంతో సుఖప్రసవాలు పెరిగాయి. మాతా శిశు మరణాల రేటు కూడా బాగా తగ్గడానికి ఈ విధానం ఉపయోగపడింది. గతంలో మాతా శిశుమరణాలు 8 శాతం వరకు ఉండేవి. ఇప్పుడు 4 శాతానికి తగ్గాయి. బర్త్ కంపానియన్ విధానం అమలవుతున్నప్పటి నుంచి 240 సుఖ ప్రసవాలు చేయగలిగాం. ఈ విధానం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి.
-డాక్టర్ స్వామి, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్
ఇవి కూడా చదవండి
పవన్, మహేష్ గురించి శృతి ఒక్కముక్కలో ఏం చెప్పిందంటే..?
వాట్సాప్ నంబర్ అడిగితే శృతిహాసన్ ఏం ఇచ్చిందో తెలుసా..?
టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అంబేద్కర్కు ఘన నివాళులు