గ్రామాలు, మండలాల్లో స్వచ్ఛంద లాక్డౌన్
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గ్రామస్తుల తీర్మానం
ఇప్పటికే పలుచోట్ల అమలు.. రానున్న రోజుల్లో మరికొన్ని చోట్ల..
నిర్మల్లో పెయింట్ దుకాణాల సమయంలో మార్పు
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 14 : జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తమవుతున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామాలు, మండల కేంద్రాల్లో గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ను విధించుకుంటున్నారు. వైరస్ అడ్డుకట్టకు స్వచ్ఛంద లాక్డౌనే శ్రేయస్క రం కావడంతో ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.
గతేడాది ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ను విధించగా.. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగింది. దీంతో ప్రజలందరూ గతంలో ప్రభు త్వం తీసుకున్న చర్యలకే మొగ్గు చూపుతున్నారు. అవసరం ఉంటేనే ప్రజలు బయటకు వెళ్లాలని, స్వచ్ఛంద లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేలా తీర్మానించుకున్నారు. ఇలాంటి నిర్ణయాలతో గ్రామాల్లో కరోనా వైరస్కు అడ్డుకట్ట వేస్తున్నారు. కేసులు పెరుగుతున్న చోట్ల ఇతర గ్రామాలను ఆదర్శంగా తీసుకొని లాక్డౌన్కు తీర్మానం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో సైతం పేయింట్ దుకాణాల నిర్వాహకులు సాయంత్రం 6 గంటల వరకే దుకాణాలను తెరిచి ఉంచుతామని తీర్మానించారు.
స్వచ్ఛందానికే మొగ్గు..
మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంత ప్రజలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ చేపడుతున్నారు. భైంసాలోని మహగాం, కుంటాల మండలకేం ద్రం, నిర్మల్ మండలంలోని కడ్తాల్, దిలావర్పూ ర్ మండలకేంద్రం, పెంబి గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకొని కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రజలందరూ నిబంధనలు పాటించేలా వివరిస్తున్నారు. స్వచ్ఛంద లాక్డౌన్ విధిస్తున్న పలు చోట్ల ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని తీర్మానించగా.. మరికొన్ని చోట్ల ఉ దయం, సాయంత్రం రెండు గంటల పాటు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించేలా గట్టి నిఘాను అమలు పరుస్తున్నారు.
రానున్న రోజుల్లో మరికొన్ని చోట్ల..
జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పలు చోట్ల లాక్డౌన్ విధించుకొని కట్టడికి చర్యలు చేపట్టగా.. పలు మండలాల్లోనూ స్వచ్ఛంద లాక్డౌన్పై దృష్టి సారిస్తున్నారు. ఉదయం, సాయం త్రం వేళల్లో నిత్యావరసర సరుకులు కొనుగోలు చేసేందుకు అనువుగా విధివిధానాలను సిద్ధం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీకారం..
జిల్లా కేంద్రంలో కొవిడ్ కేసులను అడ్డుకట్ట వేసేందుకు నిర్మల్లో పేయింట్ దుకాణాల యజమానులు ముందుకొచ్చారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా దుకాణాల సమయాలను కుదించారు. ఉ దయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వర కు దుకాణాలను తెరిచి ఉంచగా.. స్వచ్ఛంద లాక్డౌన్తో సోమవారం నుంచి దుకాణాల సమయాన్ని కుదించారు. సాయంత్రం 6 గంటల వర కే షాపులు తెరిచి ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సైతం తీర్మానించారు. వీరి బాటలోనే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణాల వారు సైతం సాయంత్రం 6.30 వరకే తెరిచి ఉంచాలని రాష్ట్ర అసోసియేషన్ తీర్మానించింది. దీంతో రానున్న రోజుల్లో మరికొన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు సైతం స్వచ్ఛంద లాక్డౌన్కు శ్రీకారం చుట్టనున్నాయి.