నిర్మల్ టౌన్, అక్టోబర్ 13 : 57 ఏళ్లు నిండిన వారికీ ఆసరా పింఛన్లు అందిస్తామన్న రాష్ట్ర సర్కారు, ఆ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నెల 31 వరకు అవకాశమివ్వగా, ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71,177 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. త్వరలో వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని తెలుపగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్ అందిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో అధికారుల ఉత్తర్వుల మేరకు సోమవారం నుంచే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్నారు. 2018లో అధికారంలోకి వస్తే రూ.1000 ఉన్న పింఛన్నురూ.2016 పెంచుతామని హామీనివ్వగా దానిని అమలు చేస్తున్నారు. గతంలో 65 ఏళ్లు నిండిన వారికి పింఛన్ అమలు చేయగా, ఇప్పుడు 57 ఏళ్లకు తగ్గించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో మరింత మందికి లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొ త్తం 71,177 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 45 వేలు పాత దరఖాస్తులు కాగా, మిగితావి కొ త్తవి. ఇందులో అత్యధికంగా నిర్మల్లో 25,256 దరఖాస్తులు రాగా ఆదిలాబాదులో 16,840, మంచిర్యాల్లో17,316, కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లాలో 11,751 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు
దరఖాస్తులకు మరో చాన్స్
ఇప్పటికే మొదటి విడతగా ఆగస్టు 31వరకు 57 ఏళ్లు నిండిన వారందరూ వృద్ధ్దాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి అర్హులకు పెన్షన్లు మంజూరు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకొని వారు ఉంటారని భావించిన ప్రభుత్వం మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 11 నుంచి 31 వరకు అవకాశం కల్పించింది. ఆధార్కార్డు, వయసు ధ్రువీకరణపత్రం ఆధారంగా మీసేవ కేంద్రాల్లో పేరు, ఊరు, వయసు, మండలం, జిల్లా, అన్ని వివరాలతో దరఖాస్తు చేసుకుంటున్నారు. నిర్ణీత రుసుంను కూడా ప్రకటించింది. అయితే కొన్ని మీసేవ కేంద్రాల్లో ఆధార్ కార్డుపై వయసు తగ్గింపు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆధ్వర్యంలో మీసేవ కేంద్రాల నిర్వాహకులతో జిల్లా ఈ మేనేజర్తో ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అక్రమాలకు పాల్పడితే మీసేవ కేంద్రాన్ని రద్దు చేయడమే తకాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి..
నిర్మల్ జిల్లాలో 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వయసు ధ్రువీకరణ పత్రం తో పాటు నివాస, పూర్తి వివరాలతో మీసేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే విచారణ చేసి అర్హులను ఎంపిక చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తుదారుల పూర్తి వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో అందజేస్తున్నాం.
-వెంకటేశ్వర్రావు, డీఆర్డీవో, నిర్మల్