కలెక్టర్ రాహుల్రాజ్
ఆసిఫాబాద్లో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సమీక్ష
ఆసిఫాబాద్టౌన్, సెప్టెంబర్ 13 : జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని, సకాలంలో పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనప్పతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రహదారుల పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరందించాలన్నారు. విద్యుత్ సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ అధికారులు స్థానికంగా ఉండడం లేదని, పలు మండలాల్లో రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే బాగు చేయాలని, అలాగే అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి శాంతారామ్ పాల్గొన్నారు.