నీటి వృథాను అరికట్టేందుకు సర్కారు చర్యలు
స్కాడా వ్యవస్థతో ప్రత్యేక కంట్రోల్ రూం
నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు నిధులతో ఏర్పాటు
ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా టెండరు దాఖలు
తీరనున్న వెతలు.. సాఫీగా నీటి విడుదలకు చాన్స్..
నూతన విధానంతో తెరుచుకోనున్న క్రస్ట్గేట్లు
కడెం, సెప్టెంబర్ 13 : జలాశయాల నుంచి నీటి వృథాను అరికట్టేందుకు, మరమ్మతులకు చెక్పెట్టేందుకు సర్కారు నూతన విధానాన్ని అవలంబిస్తున్నది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు రిమోట్ గేట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతోపాటు, గోదావరిపై నిర్మించిన నూతన ప్రాజెక్టులకూ అమర్చి, నీటి విడుదల చేస్తున్న మాదిరిగానే చేయాలని చూస్తున్నది. కడెంకు 18 వరద గేట్లు ఉండగా.. 60 ఏండ్లుగా మార్చకపోవడంతో ఫ్లడ్ అధికంగా ఉన్న సమయంలో నీరు లీకేజీ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఇదే మాదిరిగా కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ, నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీలకు కూడా ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు(ఎన్హెచ్పీ) నిధులతో అమర్చనుండగా.. ప్రాజెక్టు వద్ద కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా టెండరుదాఖలుకు అవకాశం కల్పించారు.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లో కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఉంది. నిర్మల్ జిల్లాలోని కడెం, దస్తురాబాద్.. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల రైతులకు సాగునీరు అందిస్తున్నది. యేటా వానకాలం లో కురిసే వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొ దటి సారిగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరే జలాశయం ఇదే. దీనిని 1949-1965 మధ్యకాలంలో నిర్మించగా.. 18 వరదగేట్లను అమర్చారు. ఇందులో తొమ్మిది గేట్లు జపాన్, మరో తొమ్మిది ఇండియా టెక్నాలజీతో ఏర్పా టు చేశారు. 30 ఏండ్లకు గేట్లను మార్చాల్సి ఉండగా.. 60 ఏండ్లు దాటినా మార్చకపోవడంతో నీరు వృథాగా పోతున్నది. వీటికి తాత్కాలిక మరమ్మతు చేపట్టడం, భారీగా వరదొస్తే మొరాయించడం వంటివి సాధారణమైంది. 2019లో ప్రాజెక్టు రెండో నంబర్ వరదగేటు కౌంటర్ వెయిట్ విరిగి పడడంతో భారీగా నీరు వృథాగా పోయింది. హైదరాబాద్కు చెందిన డ్యాం సెఫ్టీ ఆర్గనైజేషన్ బృందం ఇంజినీర్లు సత్యనారాయణ, శ్రీనివాస్ 20 రోజులపాటు శ్రమించి గేట్లు అమర్చారు.
ఇప్పటికే ఎల్లంపల్లికి ఏర్పాటు
కడెం ప్రాజెక్టు ఆయకట్టు, వరద సామర్థ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వరదగేట్ల స్థానంలో రిమోట్తో ఆపరేట్ చేసే క్రస్ట్గేట్లను అమర్చాలని నిర్ణయం తీసుకున్నది. మాన్యువల్ గేట్ల వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో రిమోట్ కంట్రోల్ విధానం ద్వారా సులువుగా ఉంటుందని, మొదటి దశ కింద కడెంను ఎంపిక చేసి టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నది. మాన్యువల్గా అయితే భారీగా వరద వస్తున్నప్పుడు గేట్లను తెరవడం ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్కో గేటు తర్వాత మరో గేటు తెరవాల్సి ఉంటుంది. దీంతో ప్రాణాపాయం కూడా ఉందని గుర్తించిన సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతోపాటు, గోదావరిపై నిర్మించిన నూతన ప్రాజెక్టులకు రిమోట్ గేట్లను అమర్చి, నీటి విడుదల చేస్తున్నారు.
స్కాడా వ్యవస్థతో కంట్రోల్ రూం
నూతనంగా అమర్చే రిమోట్ గేట్లతోపాటు, ప్రాజెక్టు వద్ద కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ కంట్రోల్ రూం ద్వారానే వరదగేట్లను ఎత్తుతారు. స్కాడా(సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆక్విజిషన్) వ్యవస్థతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి వరద ప్రవావాన్ని కచ్చితంగా అంచనా వేసే ప్రక్రియను ముందుకు తీసుకురానున్నారు. ఫలితంగా వరదగేట్లు ఎన్ని తెరవాలి? ఎన్ని ఫీట్లు ఎత్తాలి? అని నిర్ణయించి దిగువకు నీటిని విడుదల చేయడం సులభంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా సిబ్బంది కూడా పెద్దగా అవసరం ఉండదు. అధికారులు అందుబాటులో ఉండి ప్రాజెక్టును సేఫ్టీగా ఉంచవచ్చని ప్రభుత్వం భావించి కడెంతోపాటు,ఎల్ఎండీ, ఎస్సారెస్పీ ప్రాజెక్టులకు రిమో ట్ గేట్లు అమర్చేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నది.
‘రిమోట్’ఏర్పాటుతో ప్రయోజనం
కడెం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఉన్న వరదగేట్ల వల్ల లీకేజీలతో ఇబ్బందులున్నాయి. అలాగే వాటికి యేటా తాత్కాలిక మరమ్మతులు చేస్తూ ఇబ్బందులు తీరేలా చూస్తున్నాం. కానీ.. వరద ప్రవాహం అధికంగా ఉంటుంది. దీనికి రిమోట్ గేట్లను అమర్చడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు. త్వరలోనే కడెం ప్రాజెక్టుకు కూడా రిమోట్ విధానం ద్వారా గేట్లను ఎత్తే అవకాశం ఉంది.