ఆదిలాబాద్ రూరల్, జూలై 13: తాను గెలిచిన వెంటనే లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ సోయం బాపురావ్ మాట నిలబెట్టుకోనందున తన పదవికి రాజీనామా చేయాలని తొమ్మిది తెగల ఆదివాసీ నాయకులు జంగుపటేల్, కోడప సోనేరావ్, కుర్సంగే తానాజీ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం వారు మాట్లాడారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేలా పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెప్పి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను ఇచ్చిన మాటపై నిలబడకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ‘లంబాడా హఠావో..ఆదివాసీ బచావో’ నినాదంతో తుడుందెబ్బను స్థాపించారని, ఆ తర్వాత కాంగ్రెస్లో సీటు రాకపోవడంతో బీజేపీలో చేరి ఎంపీగా గెలిచాడని గిరిజనులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంపై మండిపడ్డారు. ప్రస్తుతం ఎంపీ తాను గిరిజనుల టైగర్ అని, రాథోడ్ రమేశ్ లంబాడాల టైగర్ అంటూ మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. ఆదివాసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోని ఎంపీ సోయం బాపురావ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు రామ్చందర్, సర్పంచ్లు సిడాం లక్ష్మణ్, కుమ్రం వసంత్రావ్, అంకోలి ఎంపీటీసీ మడావి కిషన్, హీరాసుక్క సంఘం నాయకులు సిడాం రామ్కిషన్ తదితరులు పాల్గొన్నారు.