సమస్యలు టాస్క్ఫోర్స్ కమిటీకి తెలియజేస్తాం
రిమ్స్లో మెరుగైన వైద్యసేవలు
అధికారుల సమావేశంలో మంత్రి అల్లోల
ఆదిలాబాద్, మే 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరి సహకారం తోనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని, ప్రజలు దీనికి సహకరించాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యవరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు పరిస్థితులపై ఆదిలాబాద్ కలెక్టరేట్లో గురువారం ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఇన్చార్జి కలెక్టర్ రాహుల్రాజ్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్రతో కలిసి మంత్రి సమీక్ష జరిపారు. కరోనా నియంత్రణలో భాగంగా ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని, రాష్ట్ర టాస్క్ఫోర్స్ కమిటీకి తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. లాక్డౌన్కు ప్రజలు ఎంతోగానో సహకరిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, 550 బెడ్స్ అందుబాటులో ఉండడంతో పాటు ప్రైవేట్ దవాఖానల్లో 673 బెడ్స్ ఉన్నాయన్నారు. రిమ్స్లో ఆక్సిజన్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, అవసరమైన వారికి రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఇతర మందులు అందించాలని సూచించారు. అధికారుల నివేదికల ప్రకారం జిల్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 45 ప్రైవేట్ దవాఖానల్లో కరోనా చికిత్సలకు అనుమతులున్నాయని చెప్పారు. నిర్వాహకులు రోగుల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోకుండా వైద్య, పోలీసు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని, లక్షణాలు ఉన్న వారికి ప్రాథమిక దశలోనే వైద్యం అందుతుందన్నారు.
సరిహద్దులో నిఘా పెంచాలి ఎమ్మెల్యే జోగు రామన్న
జిల్లాలోని జైనథ్, బేల, భీంపూర్, తాంసి మండలాల్లోని పలు గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయని, సరిహద్దు గ్రామాల్లో నిఘా పెంచాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. జిల్లాలో అధికారులు కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారన్నారని తెలిపారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి కరోనా టీకాలు వేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో జాడి రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.