సర్కారు పకడ్బందీ చర్యలతో సత్ఫలితాలు
మొలకెత్తుతున్న పత్తి, కంది, సోయాబీన్..
అనుకూలిస్తున్న వానలు.. ఆనందంలో రైతులు
నకిలీ విత్తనాలు, ఎరువుల కట్టడితో అన్నదాతలకు మేలు
ఆదిలాబాద్, జూలై 12 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ యేడాది వానకాలంలో రైతులు నష్టపోకుండా సర్కారు తీసుకున్న పకడ్బందీ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచే పోలీసు, వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించకుండా అడ్డుకట్ట వేశాయి. ఫలితంగా నాణ్యమైన పత్తి, కంది, సోయాబీన్ విత్తనాలు లభించగా, ప్రస్తుతం అవి మొలకెత్తుతున్నాయి. మరోవైపు వానలు సైతం అనుకూలిస్తుండడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో రైతులు ఈ ఏడాది వానకాలం సీజన్లో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసా య శాఖ అధికారులు అంచనా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పత్తి, కంది, సోయాబీన్, నిర్మల్లో వరి, పత్తి పంటలను సాగు చేస్తారు. రెండు జిల్లాల్లో రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కారణంగా రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. పోలీసు, వ్యవసాయశాఖ అధికారులతో సీజన్ ప్రారంభంలోనే జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో డీఎస్పీ, జేడీఏ, ఏడీఏలు, మండల స్థాయిలో ఎస్సై లు, మండల వ్యవసాయ శాఖ అధికారులో కూడిన తనిఖీ బృందాలు దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలు జరుగకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వ్యాపారులు ఎలాంటి విత్తనాలు, అమ్ముతున్నారు, నకిలీవా, అసలీవా అని తనిఖీల్లో గుర్తించారు. అనుమతులు లేని పురుగు మందులు విక్రయాలు జరుగుతున్నాయనే విషయాలను సైతం తెలుసుకున్నారు. వ్యాపారులు రైతులకు విక్రయించే విత్తనాలకు సంబంధించిన బిల్లులు సరిగా ఇస్తున్నారా లేదా, స్టాక్, ఇతర వివరాలను పరిశీలిస్తారు. విత్తనాలు, ఎరువుల గోదాంలలో సైతం తనిఖీలు చేపట్టారు. నకిలీలను రైతులకు అంటగట్టకుండా జిల్లా, మండల కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి నకిలీవి, అనుమతి లేనివి విక్రయించకుండా సూచనలు చేసి నిబంధల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కల్తీ విత్తనాలపై ఫిర్యాదు చేయడం కోసం నంబర్ 94409 00635, నిర్మల్ జిల్లాలో 94409 00680 కు సమాచారం ఇవ్వాలను రైతులకు సూచించారు.
28 కేసులు నమోదు. 35 మంది అరెస్ట్
నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలు జరుగకుండా తనిఖీలు నిర్వహించిన అధికారుల బృందాలు రెండు జిల్లాల్లో 28 కేసులు నమోదు చేసి 35 మందిని అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 23 కేసుల్లో 29 మందిని అరెస్ట్ చేయగా 34 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, 9 క్వింటాళ్ల గడువు దాటిన విత్తనాలు, 2300 లీటర్ల గడువు దాటిన పురుగు మం దులు, 900 క్వింటాళ్ల ఎరువులు, 620 క్వింటాళ్ల అనుమతి లేని ఎరువులు స్వాధీనం చేసుకున్నారు. పలు దుకాణాల్లో అక్రమంగా విక్రయించేందుకు పట్టపడిన వీటి విలువ రూ.68 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లాలో అనుమతి లేని పురుగుల మందులు విక్రయిస్తున్నందుకుగానూ ఐదు కేసుల్లో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. రూ.52 వేల విలువ గల అనుమతి లేని మందులను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీలతో నకిలీలకు అడ్డుకట్ట పడింది. వ్యాపారులు తమ దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయిస్తున్నారు. రైతులకు అసలైన విత్తనాలు లభించడంతో వానకాలం సీజన్లో వేసిన పత్తి, కంది, సోయాబీన్ విత్తనాలు మొలకెత్తాయి. పంటల సాగుకు వానల సైతం అనుకూలిస్తుండటంతో బాగా పెరుగుతున్నాయి.