రూ. 6 కోట్లతో అతిథి గృహాల నిర్మాణం పూర్తి
రూ. 50 లక్షలతో భక్తుల విడిదికి ప్రత్యేక షెడ్లు
ఆలయం చుట్టూ ప్రహరీ పూర్తి
త్వరలో ఆలయ గర్భగుడి విస్తరణ పనులు
రూ. 126 కోట్లతో సర్కారుకు చేరిన ప్రతిపాదనలు
బాసర,జూలై 12: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రంలో అభివృద్ధి మంత్రం వినిపిస్తున్నది. రాష్ట్ర సర్కారు ఇటీవల వివిధ పనులకు శ్రీకారం చుట్టగా, అధికార యంత్రాంగం త్వరితగతిన పూర్తి చేయిస్తున్నది. రూ. 6కోట్లతో వసతి గృహాల నిర్మాణం, భక్తులు సేదతీరేందుకు షెడ్లు, చుట్టూ ప్రహరీ పూర్తయింది. ఆలయ విస్తరణతో పాటు మరిన్ని పనులు చేపట్టేందుకు రూ. 126 కోట్లతో దేవాదాయ శాఖ యంత్రాంగం ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపించింది. దీంతో దశల వారీగా మిగతా పనులు మొదలుకానుండగా, భక్తులకు పూర్తి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
బాసర క్షేత్రం అభివృద్ధిలో భాగంగా మొదటి విడుతగా రూ. 6 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ఆలయం వద్ద గల యాదగిరి గుట్ట, శ్రీశైలం, ద్వారక తిరుమల, వేములవాడ, విజయవాడ ఇంద్రకీలాద్రి వసతి గృహాలపై మరో అంతస్తు నిర్మించి దాదాపు 20 ఏసీ గదులను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా లడ్డూ కౌంటర్కు వెళ్లే మార్గంతో పాటు ఆలయ అతిథి గృహాల ముందు భక్తులు విడిది చేసేందుకు వీలుగా రూ. 50లక్షలతో షెడ్లను నిర్మించారు. అలాగే ఆలయం చుట్టూ ప్రహరీ కూడా దాదాపు పూర్తయింది. వీటిని త్వరలోనే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించనున్నారు.
గర్భగుడి విస్తరణకు త్వరలోనే శ్రీకారం..
సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఉన్న గర్భగుడిని విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. రూ. రెండున్నర కోట్లతో ఆలయ గర్భగుడిని పూర్తిగా తొలగించేసి యాదగిరి గుట్ట తరహాలో కృష్ణ శిలతో నిర్మించనున్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గర్భగుడిలో సరస్వతీ, మహాలక్ష్మీ అమ్మవార్లు ఉంటారు. భక్తులు సరస్వతీ అమ్మవారిని మాత్రమే దర్శించుకుంటున్నారు. పక్కనే ఉన్న మహాలక్ష్మీ అమ్మవారు కనిపించక పోవడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న గర్భగుడిని విస్తరిస్తే ఇద్దరు అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆలయ విస్తరణతో పాటు మరిన్ని పనులు చేపట్టేందుకు రూ. 126 కోట్లతో దేవాదాయ శాఖ యంత్రాంగం ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభించనున్నారు.
త్వరలోనే అతిథి గృహాల ప్రారంభం
ఆలయాభివృద్ధిలో భాగంగా రూ. 6కోట్లతో 20 ఏసీ గృహాలు, భక్తులు విడిది చేసేందుకు వీలుగా షెడ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రస్తుతం కొవిడ్ నిబంధనల ప్రకారం భక్తులకు అన్ని సేవలు అందిస్తున్నాం. అతిథి గృహాలు ప్రారంభం కాగానే భక్తులకు సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం.
-వినోద్రెడ్డి, ఈవో