కరోనా నియంత్రణకు ప్రత్యేక కమిటీ
ప్రజలు పూర్తి సహకారం అందించాలి
కొవిడ్ బాధితుల కోసం దవాఖానల్లో బెడ్లు..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యాధికారులు, మేనేజ్మెంట్, జిల్లా అధికారులతో సమావేశం
నిర్మల్ టౌన్, మే 12 : కొవిడ్ మహమ్మారిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యాధికారులు, మేనేజ్మెంట్, జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. మే 12 నుంచి 21వ తేదీ వరకు పదిరోజుల పాటు లాక్డౌన్ విధించినట్లు చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం 4 గంటల పాటు మాత్రమే ప్రజల అవసరాల మేరకు అన్ని రకాల షాపులు తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రజలు పూర్తి సహకారం అందించాలని, గుంపులు గుంపులుగా వెళ్లకుండా భౌతిక దూరం పాటించాలని, మాస్క్లు, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. వ్యాపార సముదాయాలు 10 గంటలకే మూసివేయాలని, అనవసరంగా ఇంటి నుంచి బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో వ్యాక్సినేషన్, ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉంచాలని, కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ దవాఖానలో 135 పడకలు, ప్రైవేట్లో 311 పడకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా మంత్రి అధ్యక్షతన కలెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారి, సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్తో కమిటీ వేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పనులు, అనుబంధ రంగా లు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి పనులు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. అనంతరం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడారు. చెక్పోస్టుల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు, ట్రాన్స్పోర్ట్ అధికారి, వైద్య సిబ్బంది, రెవ్వెన్యూ సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.