అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవతో అభివృద్ధి
వైకుంఠధామంతో తీరిన తిప్పలు
ఎప్పటికప్పుడు డంప్యార్డుకు చెత్తా చెదారం
వాడవాడలా సీసీ రోడ్లు
ప్రతి పోల్కు విద్యుద్దీపాలు
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వనం
మంచిర్యాల, ఏప్రిల్ 9, నమస్తే తెలంగాణ:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లెప్రగతి’తో సుంపుటం గ్రామ రూపురేఖలు మారిపోయాయి. వైకుంఠధామం నిర్మాణంతో దహన సంస్కారాలకు ఇబ్బందులు తొలగిపోయాయి. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన డంప్యార్డుకు ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తరలిస్తుండగా, వాడలన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. బురద రోడ్లన్నీ సీసీగా మారి అద్దంలా మెరుస్తున్నాయి. రాత్రిళ్లు విద్యుద్దీపాలతో వీధులన్నీ జిగేల్మంటున్నాయి. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతూ ఆహ్లాదం పంచుతున్నాయి. నాడు అధ్వానంగా ఉన్న ఆ పల్లె నేడు సకల సౌకర్యాలతో సుందరంగా దర్శనమిస్తుండగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సుంపుటంలో పచ్చదనం పరుచుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నది. ‘పల్లె ప్రకృతివనం’లో వివిధ రకాలైన పూలు, ఔషధ, నీడనిచ్చే మొక్కలను నాటారు. రూ.6 లక్షల 10 వేలా 297 అంచనాతో దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో 2000 మొక్కలు పెంచుతున్నారు. జామ, నిమ్మ, దానిమ్మ, వెలుగ, అల్లనేరేడు, మామిడి, చింత, కానుగ, అడవి తంగడి, నిద్ర గన్నేరు, చిన్న బాదం, 8 ఆకుల చెట్టు, సోమింట, నెమిలి నేర, ఈట, గుల్మహర్, గోరింట, మొదలైన దాదాపు 95 శాతం మొక్కలు బతికే ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వీటి సంరక్షణ బాధ్యతలను చూస్తున్నారు. హరితహారంలో భాగంగా రూ.లక్షా 89 వేల 441 అంచనా విలువతో గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేశారు. ఇందులో కూలీలకు రూ.లక్షా 18 వేల 953, సామగ్రికి రూ.70 వేల 488గా అంచనా వేశారు. కాగా, నర్సరీలో 16 వేల మొక్కలను పెంచుతున్నారు. గ్రామంలో అభివృద్ధి కోసం సర్పంచ్ బాపు, కార్యదర్శి సిరాజుద్దీన్తో పాటు ఇగురం వెంకట్, చప్పిడె తిరుపతి, గ్రామస్తులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
అడుగడుగునా అభివృద్ధి..
సుంపుటంలో 281 నివాస గృహాలుండగా, 956 జనాభా ఉంది. ఇందులో 474 మంది స్త్రీలు, 482 మంది పురుషులు ఉన్నారు. ఎవరైనా చనిపోతే దహన సంస్కారానికి ఇబ్బంది రాకుండా ఉండేలా వైకుంఠధామాన్ని రూ.12 లక్షల 60 వేల ఈజీఎస్ నిధులతో నిర్మించారు. కర్మకాండ, శవాలను ఉంచేందుకు వేర్వేరుగా ప్రత్యేక గద్దెలను ఏర్పాటు చేశారు. రెండు బర్నింగ్ పాయింట్లు ఉన్నాయి. బట్టలు మార్చుకునేందుకు, స్నానాల కోసం గదులను నిర్మించారు. మరుగుదొడ్లు కూడా ఉన్నాయి. పారిశుధ్యంలో భాగంగా చెత్తాచెదారాన్ని సేకరించి పారబోసేందుకు ఊరి పొలిమేరలో డంప్ యార్డును ఏర్పాటు చేశారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం రూ.2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్ను నిర్మించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బంది వేస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా 40 మీటర్ల మేర విద్యుత్ లూజ్ లేన్లు, వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేశారు. 140 విద్యుత్ స్తంభాలుండగా, ప్రతి పోల్కూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. 127 స్తంభాలకు థర్డ్ లేన్ వైరును బిగించారు. వాడవాడలా సీసీ రోడ్లు నిర్మించారు.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
గ్రామంలో ఇద్దరు పారిశుధ్య కార్మికులున్నారు. వారికి ఏడాదికి రూ.2,04,000 జీతాలు చెల్లిస్తున్నారు. రూ.8 లక్షల (ఈఎంఐ)తో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను కొనుగోలు చేశారు. వీటితో ప్రతి రోజూ ఇళ్ల నుంచి తడిపొడి చెత్తను పారిశుధ్య సిబ్బంది తరలిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన గ్రామానికి ఏడాదికి రూ.15 లక్షల 96 వేలు (ప్రతి నెల రూ.లక్షా 33 వేలు) వస్తున్నాయి. ఇందులో పది శాతం గ్రీనరీ బడ్జెట్ రూ.లక్షా 59 వేల 600 కాగా, ట్రాక్టర్లు, ఇతరులకు ఏడాదికి రూ.లక్షా 43 వేల 280 కిస్తు చెల్లిస్తున్నారు. గ్రామంలో చెత్త సేకరణకు ఒక సైకిల్ రిక్షా బండి ఉంది. తడి, పొడి చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు చొప్పున 281 గృహాలకు 562 బుట్టలు పంపిణీ చేశారు. పారిశుధ్యంలో భాగంగా సామూహిక మరుగుదొడ్లనూ వినియోగిస్తున్నారు. 147 వ్యక్తిగత, నాలుగు కమ్యూనిటీ ఇంకుడు గుంతలను నిర్మించారు. మూలల వద్ద, ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సామూహిక చేతిపంపుల వద్ద నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. బోరింగ్ వద్ద నుంచి నీరు ఇంకుడుగుంతలోకి వెళ్లేలా పైపులను అమర్చారు. 43 నివాసాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు.
సమష్టి కృషితోనే..
సమష్టి కృషితోనే గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. గ్రామస్తులు, కార్యదర్శితో పాటు నేనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. ఇగురం వెంకట్, చప్పిడె తిరుపతి కూడా ఎనలేని కృషి చేస్తున్నారు. రోజూ పారిశుధ్య సిబ్బంది చెత్త తీసేస్తుం డడంతో ఎక్కడ చూసినా శుభ్రంగానే కనిపిస్తున్నది. ప్రకృతివనం, నర్సరీలు, డంప్యార్డు ఏర్పాటు చేశాం. వైకుంఠ ధామంతో దహన సంస్కార కార్యక్రమా ల సమస్య కూడా తీరింది. గతంలో మా ఊరికి రావాలంటేనే భయపడేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. రోడ్లు, నీటితో పాటు అన్ని సౌకర్యాలూ కల్పించాం.
ఇవి కూడా చదవండి
అఖిల్ ప్రాణం పెట్టేస్తున్నాడు..!
కరోనా సెకండ్ వేవ్ తో యువతకే డేంజర్ : ఐఎంఏ ప్రెసిడెంట్ హెచ్చరిక
రాహుల్ ద్రవిడ్ను ఎప్పుడైనా ఇలా చూశారా.. కోహ్లి షేర్ చేసిన ఫన్నీ వీడియో
41 సెంట్రల్ యూనివర్సిటీలకు ఒకే పరీక్ష
ఢిల్లీ ఎయిమ్స్లో 35 మంది వైద్యులకు కరోనా