పాత పద్ధతులకే రైతుల మొగ్గు
రసాయన మందులు, ఎరువులు లేకుండా సాగు
కూరగాయలు, పండ్లు, వివిధ రకాల పంటలు పండిస్తున్న వైనం
ఆదర్శంగా నిలుస్తున్న రైతులు
కుభీర్, ఏప్రిల్ 8 : మండల కేంద్రం కుభీర్తో పాటు సిర్పెల్లి (హెచ్), పల్సి, పాంగ్ర, రాజురా, డోడర్న, ధార్కుభీర్, పార్డి(కె) గ్రామాల్లో ఒక్కొక్క రైతు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించారు. రసాయన మందులు, ఎరువులు లేకుండా వివిధ చెట్ల ఆకులు, ఆవు మూత్రం, పేడ, పుట్ట మన్ను, వేప నూనె లాంటి ద్రవ మిశ్రమంతో పంటలకు పిచికారీ చేస్తూ రసాయన రహిత పంటలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
ఆయుర్వేద వైద్యుడి సహకారంతో..
ఆయుర్వేద వైద్యంలో పట్టా పుచ్చుకున్న డాక్టర్ పేండ్కర్ సంతోష్ తనకున్న ఐదెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తమ్ముడు పేండ్కర్ సతీశ్ ఆధ్వర్యంలో ముందుగా ఒక ఆవును కొనుగోలు చేశాడు. వేసవిలో భూమిని దున్నిన అనంతరం 20 ట్రాక్టర్ల సేంద్రియ ఎరువును అందులో వేశాడు. ఇక వానకాలం సీజన్ మొదలవగానే పాలేరును పెట్టుకున్నాడు. ఐదెకరాల్లో సోయా సాగు చేసి ఒడ్ల పొడగునా కంది, బంతి, చామంతి పూల మొక్కలను సాగు చేశాడు. రసాయన ఎరువులు, మందులు ఏవీ వాడకుండా చేనులోనే వివిధ రకాల చెట్ల ఆకులు, ఆవు మూత్రం, పేడ తదితరవి ప్రకృతిలో ఉచితంగా లభించే వాటితో స్వయంగా ఆయుర్వేద వైద్యుడైన తన అన్న సహకారంతో ద్రావణం తయారు చేసి పిచికారీ చేశాడు. సోయా పంట ఐదెకరాల్లో మంచి దిగుబడి సైతం వచ్చింది. ఇక యాసంగిలో ప్రధాన పంటలైన గోధుమ, శనగ, వేరుశనగ, మిర్చితో పాటు ఒక ఎకరంలో టమాట, వంకాయ, కొత్తిమీర, పాలకూర, క్యారెట్, కాకర, గోరు చిక్కుడు, ఉల్లి, వెల్లుల్లి లాంటివి సాగు చేశాడు. ప్రజలు ఎండు మిర్చి, కూరగాయలను ప్రతిరోజూ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.
ద్రావణం తయారీ ఇలా..
250లీటర్ల (డ్రమ్) నీటిలో వేపాకు, ఉత్తరేణి, భేల్పత్రి, గన్నేరు, మందారం, జిల్లేడు, సీతాఫలం, మామిడి, ఆము దం, అయిల ఆకు రెండు కిలోల చొప్పున తీసుకోవాలి. దంచిన అల్లం, దంచిన వెల్లుల్లి, దంచిన పచ్చిమిర్చి, తంబాకు, పసుపు అరకిలో చొప్పున అవసరమవుతాయి. రెండు కేజీల ఆవు పేడ, 20 లీటర్ల ఆవు మూత్రం, రెండు లీ టర్ల వేప నూనెను వేసి కలుపుకోవాలి. డ్రమ్ను గుడ్డతో క ప్పాలి. ప్రతిరోజూ రెండు సార్లు కింది నుంచి కర్రతో బాగా కలియబెట్టాలి. 21 రోజులు నానిన తర్వాత ఆ మిశ్రమం నుంచి బెరడును వడబోసి పిప్పిని పారేయాలి. ఆ తర్వాత వివిధ పంటలపై పురుగు ఉధృతిని బట్టి 20 లీటర్ల నీటికి రెం డు లీటర్ల మిశ్రమ ద్రావణం కలుపుకొని పిచికారీ చేయాలి. ప్రాకృతిక వ్యవసాయంలో దీన్ని పాలేకర్ పద్ధతి అంటారు.ప్రాకృతిక వ్యవసాయం మేలు..
ప్రస్తుత వ్యవసాయ విధానంలో రసాయనాల వాడకం పెరిగిపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అంతు చిక్కని జబ్బుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి లేని ప్రాకృతిక వ్యవసాయంతో వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన, విషరహితమైన, నాణ్యమైన పంటలు చేతికందుతాయి. ఈ పంటలకు ఎక్కువ మద్దతు ధర లభిస్తుంది. రైతులు అప్పులు చేయనక్కర లేదు. ప్రభుత్వం రుణ మాఫీ చేయనవసరం లేదు. రోగాల బారి నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుంది.
పేండ్కర్ సంతోష్, ఆయుర్వేద వైద్యుడు, కుభీర్